పోచంపల్లి అక్రమాలకు కేటీఆర్​దే బాధ్యత : అద్దంకి దయాకర్

పోచంపల్లి అక్రమాలకు కేటీఆర్​దే బాధ్యత : అద్దంకి దయాకర్

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్  ఎమ్మెల్సీ  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఫామ్ హౌస్​లో జరుగుతున్న అక్రమాలకు ఆ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆరే బాధ్య త వహించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్  అన్నారు. ఈ కేసులో కేటీఆర్  శిక్షార్హుడని ఆయన ఆరోపించారు. గురువారం గాంధీ భవన్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణను క్యాసినో హబ్​గా కేటీఆర్ మార్చారని మండిపడ్డారు. అత్యాధునిక హంగులతో విదేశాల్లో ఆడే క్యాసినో, జూదాలు ఎమ్మెల్సీ పోచంపల్లి ఫామ్ హౌస్​లో నడుస్తున్నాయని అన్నారు.

బీఆర్ఎస్  సర్కారు ఇచ్చిన పర్మిషన్ తోనే గత రెండేండ్లుగా ఈ పందాలే జరుగుతున్నాయన్నారు. అలాంటి దొంగలకు కేటీఆర్  నాయకుడని అద్దంకి ఫైర్ అయ్యారు. ఫామ్ హౌస్​ను లీజుకు ఇచ్చామని బుకాయిస్తున్నారని, దొంగలకు లీజుకు ఇస్తే, ఇచ్చిన వారు కూడా దొంగలే అవుతారని విమర్శించారు. గుజరాత్​లోని సూరత్  పోర్టు నుంచి తెలుగు రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతోందని ఆయన ఆరోపించారు.