యాదాద్రి, వెలుగు: ముసాయిదా ఓటరు లిస్ట్పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఏ. భాస్కరరావు ఆదేశించారు. భువనగిరి, భూదాన్పోచంపల్లి మున్సిపాలిటీల్లో ఓటరు లిస్ట్పై వచ్చిన అభ్యంతరాలను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. ఫొటో ఓటరు లిస్ట్ సవరణ, పోలింగ్ కేంద్రాల వారీగా ఫొటో ఓటరు లిస్ట్ ప్రకటనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ లిస్ట్లో ఉండేలా పర్యవేక్షించాలని, ఓకే కుటుంబానికి చెందిన ఓటర్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చే విధంగా చూడాలని ఆదేశించారు.
13న పోలింగ్ సెంటర్ల లిస్ట్, 16న తుది ఓటర్ల లిస్ట్ రిలీజ్ చేయాలన్నారు. అనంతరం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి పోచంపల్లిలో నామినేషన్ స్వీకరణ సెంటరైన వినోబాభావే మందిరం, భువనగిరి మండలం దివ్యబాల స్కూల్లో ఏర్పాటు చేయనున్న డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ సెంటర్ను సందర్శించి పరిశీలించారు. భద్రతా చర్యలు, త్రాగునీరు వంటి మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకున్నారు. భువనగిరి మున్సిపల్ కమిషనర్ రామలింగం, పోచంపల్లి తహసీల్దారు శ్రీనివాస్ రెడ్డి, వార్డు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
