వనపర్తి, వెలుగు: వనపర్తి జిల్లాను మాదకద్రవ్య రహితంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నార్కోటిక్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గంజాయి రవాణా, సాగు, మాదక ద్రవ్యాలు వాడుతున్న వారిపై పెట్టిన కేసుల వివరాలను డీఎస్పీ వెంకటేశ్వరరావు వివరించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 8 కేసులు నమోదైనట్లు తెలిపారు.
అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాల నివారణపై నిఘా పెట్టాలని సూచించారు. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో యాంటీ డ్రగ్ కమిటీలు ఏర్పాటు చేసి విద్యార్థులకు మాదకద్రవ్యాలతో జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ యాదయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్లు శ్రావ్య, రంజిత్ రెడ్డి పాల్గొన్నారు.
