- కేంద్రం ప్రకటించినా.. జాప్యం చేస్తున్న రాష్ట్ర సర్కారు
- మే 1 నుంచే లబ్ధిదారులకు అందాల్సినవి ఆలస్యం
- సోమవారం నుంచి పాత పద్ధతిలోనే మొదలైన పంపిణీ
- కరోనా భయంతో చాలా చోట్ల షాపులు తెరవని రేషన్ డీలర్లు
హైదరాబాద్/నిర్మల్, వెలుగు: కేంద్రం ప్రకటించిన అదనపు కోటా ఉచిత రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సర్కారు లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. మే, జూన్ నెలలో ఎప్పుడూ ఇచ్చే 5 కిలోలకు అదనంగా మరో 5 కిలోలు రేషన్ ఉచితంగా ఇస్తామని కేంద్రం ప్రకటించింది. మే 1 నుంచే రేషన్ అందించాల్సి ఉన్నా.. రాష్ట్ర సర్కారు నిర్ణయం పెండింగ్లో ఉన్నందున అమలు కావడం లేదు.రెండ్రోజులపాటు సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ పేరుతో నాన్చిన సివిల్ సప్లయ్స్ డిపార్ట్ మెంట్.. సోమవారం నుంచి ప్రతి నెల ఇచ్చినట్టుగా రూపాయికి కిలో బియ్యం మాత్రమే పంపిణీ చేపట్టింది. పొరుగున ఉన్న ఏపీలో కేంద్రం ప్రకటించిన ఉచిత రేషన్ ను ఇంటింటికీ వెళ్లి ఒక్కో లబ్ధిదారునికి 10 కిలోల చొప్పున బియ్యం అందిస్తుండగా.. మన దగ్గర మాత్రం అమలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.
రాష్ట్ర సర్కారు నిర్ణయంలో జాప్యం
రేషన్ పంపిణీపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకోవడంలో జాప్యం కారణంగానే కేంద్రం ప్రకటించిన ఉచిత రేషన్ అమలు కావడం లేదని తెలుస్తోంది. గరీబ్ కల్యాణ్ యోజన కింద మే, జూన్ నెలల్లో 5 కిలోల చొప్పున రేషన్ ఉచితంగా అందిస్తామని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో కేంద్ర పరిధిలోని 53.30 లక్షల రేషన్ కార్డులకు సంబంధించి 1.91 కోట్ల మంది లబ్ధిదారుల కోసం అదనపు కోటా కూడా కేటాయించింది. అయితే దీనిపై రాష్ట్ర సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఫలితంగా ప్రజలకు శని, ఆదివారాల్లో రేషన్ అందలేదు. సీఎం నిర్ణయం తీసుకోకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అధికారులు సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ పేరుతో రేషన్ పంపిణీని రెండ్రోజులు వాయిదా వేశారు. తీరా సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంతో లబ్ధిదారుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించి సోమవారం నుంచి పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ చేపట్టారు.
88.61 లక్షల మంది లబ్ధిదారులపై నిర్ణయం కాలే..
రాష్ట్రంలో మొత్తం 87.54 లక్షల కార్డులు ఉండగా ప్రతి నెల కేంద్రం 53.30 లక్షల కార్డుల (1.91 కోట్ల లబ్ధిదారులు) కు రూ.29 సబ్సిడీ భరించి రూ.3 చొప్పున లబ్ధిదారులకు 5 కిలోల రేషన్ అందిస్తోంది. మిగతా రూ.2 రాష్ట్రం భరించి రూపాయికే కిలో చొప్పున 6 కిలోలు ఇస్తోంది. మిగతా 34.24 లక్షల కార్డుల (88.61 లక్షల మంది లబ్ధిదారులు)కు రాష్ట్ర ప్రభుత్వమే సబ్సిడీ భరించి రేషన్ ఇస్తోంది. అయితే అదనపు కోటాకు సంబంధించి సబ్సిడీ భారంపై రాష్ట్ర సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో కేంద్ర ప్రకటించిన ఫ్రీ రేషన్
అమలు కావట్లేదు.
కరోనా భయంతో రేషన్ డీలర్ల వెనకడుగు
రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందున ఐరిష్, ఓటీపీ, బయోమెట్రిక్ విధానం ద్వారా రేషన్ పంపిణీకి డీలర్లు వెనకడుగు వేస్తున్నారు.రాష్ట్రంలో 17,200 రేషన్ షాపులు ఉంటే ఇప్పటి వరకు వెయ్యి షాపులు మాత్రమే తెరిచారు. మిగతా చోట్ల పంపిణీ చేయడం లేదు. దీంతో రేషన్ కోసం పేదలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
56 మంది డీలర్లు కరోనాతో మృతి
రాష్ట్రంలో 56 మంది రేషన్ డీలర్లు కరోనాతో చనిపోయారు. 400 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా, 1500 మందికిపైగా హోం క్వారంటైన్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో తాము రేషన్ పంపిణీ చేయలేమంటూ డీలర్లు చేతులెత్తేశారు. కరోనా మొదటి వేవ్లో థర్డ్ పార్టీ ద్వారా రేషన్ పంపిణీ చేశారని, ఇప్పుడు కూడా అదే విధానాన్ని అనుమతించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై పలువురు కోర్టుకు వెళ్లడంతో బియ్యం పంపిణీపై గందరగోళం నెలకొంది.
రక్షణ చర్యలు కల్పిస్తేనే..
కరోనా రక్షణ చర్యలు కల్పిస్తేనే రేషన్ షాపులు ఓపెన్ చేస్తం. అన్ని షాపులకు శానిటైజర్, మాస్కులు సరఫరా చేయాలి. థర్డ్ పార్టీ ద్వారా రేషన్ పంపిణీకి అనుమతించాలి. రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి. -పత్తికే రాజేందర్, డీలర్ అసోసియేషన్ ప్రెసిడెంట్, నిర్మల్
భరోసా కల్పించాలి
మాకు ఇన్సూరెన్స్ కానీ ఇతర ప్రభుత్వ పథకాలు కానీ ఏమీ లేవు. కమీషన్లతోనే రేషన్ పంపిణీ చేస్తున్నం. కరోనా విజృంభిస్తున్న టైమ్ లో రేషన్ పంపిణీ చేయాలంటే ఇబ్బందిగా ఉంది. మాకు ప్రభుత్వం భరోసా కల్పించాలి.-కవిత, రేషన్ డీలర్, నర్సాపూర్