జొన్నలను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేస్తుండడంతో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డు జొన్న రైతులతో నిండిపోతోంది. మార్కెట్ ప్రాంగణమంతా జొన్న కుప్పలు, రైతులతో కిటకిటలాడుతోంది. బహిరంగ మార్కెట్లో జొన్నలకు క్వింటాల్కు సుమారు రూ.2,500 ధర ఉండగా, ప్రభుత్వం రూ.3,699 మద్దతు ధర ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కొనుగోళ్లలో జాప్యం కారణంగా మార్కెట్ యార్డులో నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులంతా ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకే పంట తీసుకురావడంతో కొంత ఆలస్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. రైతులు తీసుకొచ్చిన జొన్నలను పూర్తిగా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
వెలుగు ఫోటోగ్రాఫర్, ఆదిలాబాద్
