మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు .. శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, మంత్రులు

మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు .. శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ సీఎం, మంత్రులు
  • ఎస్టీ, ఎస్సీ, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన ఫైళ్లపై సంతకాలు
  • గౌలిదొడ్డి ఎస్సీ గురుకుల సీవోఈ  తనిఖీ.. స్టూడెంట్లతో లంచ్ 

హైదరాబాద్ , వెలుగు: ఎస్టీ, ఎస్టీ వెల్ఫేర్ శాఖ మంత్రిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్  శనివారం బాధ్యతలు తీసుకున్నారు. సెక్రటేరియెట్​లోని ఫస్ట్ ఫ్లోర్​లో ఆయనకు చాంబర్​ కేటాయించారు. లక్ష్మణ్​కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , పీసీసీ చీఫ్ మహేశ్​ కుమార్ ​గౌడ్​, మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు మకాన్ సింగ్, కాలె యాదయ్య , పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు శుభాకాంక్షలు తెలియజేశారు.  

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన పలు నిర్ణయాలపై ఆయన సంతకాలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 844 మంది దివ్యాంగులు స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేసుకునుందుకు రూ. 5 కోట్లు మంజూరు చేస్తూ, 2367 దివ్యాంగుల స్వయం సంఘాలకు రూ. 3.55 కోట్లు శాంక్షన్ చేస్తూ సంతకాలు చేశారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్​షిప్​కు ఇప్పుడు  ఏటా 210 మందికి రూ.20 లక్షలు ఇస్తుండగా.. ఈ ఏడాది నుంచి ఆ సంఖ్యను 500కు పెంచుతూ మరో ఫైల్ పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ​సంతకం చేశారు. ఎస్టీ వెల్ఫేర్​లో ఆశ్రమ పాఠశాలల్లో రూ. 79.61 కోట్లతో రిపేర్లు చేపట్టేందుకు అనుమతులు ఇచ్చారు.  

ఎస్టీ శాఖ పరిధిలో మినీ గురుకులాల నిర్వహణకు రూ. 17.18 కోట్లతో అనుమతులకు, మేడారం జాతరలో మిగిలిన  పనులకు రూ. 44.5 కోట్లు మంజూరు చేస్తూ మరికొన్ని ఫైళ్లపై ఆయన సంతకాలు చేశారు. కాగా, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన అనుచరులు.. సెక్రటేరియెట్​ బయట ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్ గాంధీతో కూడిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు. దీనిపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. దీనిపై వివరణ ఇవ్వాలని జీహెచ్​ఎంసీ అధికారులను ఆదేశించారు. 

విద్యకు టాప్​ ప్రయారిటీ

మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం గౌలిదొడ్డి ( నానక్ రామ్ గూడ) ఎస్సీ గురుకుల సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ను అడ్లూరి లక్ష్మణ్​ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టూడెంట్లతో లంచ్ చేశారు. గురుకులంలో వసతులు, టీచింగ్ , రిజల్ట్స్ పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యతను ఇస్తుందని , ఇందుకోసం ఎన్ని నిధులైనా ఖర్చు  చేసేందుకు సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఐఐటీ, జేఈఈతో పాటు మెడిసిన్ సీట్లు సంపాదించిన స్టూడెంట్లకు ఆయన ల్యాప్​టాప్​లు బహూకరించారు. అంబేద్కర్ జయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన ‘ఫోన్ మిత్ర’ను మంత్రి పరిశీలించారు.