ప్రియుడితో కలిసి తల్లిని చంపిన దత్తత కూతురు

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన దత్తత కూతురు

రంగారెడ్డి: జిల్లాలో దారుణం వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి తల్లిని హత్యచేసింది పెంచుకున్న కూతురు. ఈ అమానుష ఘటన రాజేంద్రనగర్ పరిధిలో జరిగింది. 
రాజేంద్రనగర్ ఏసీపీ సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మేరేకా అనే 65 సంవత్సరాల మహిళ కిస్మత్ పూర్‎లో ఓ ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తోంది. ఈమె రోమా అనే ఓ అనాధను దత్తత తీసుకొని పెంచుకుంది.  రోమాకు పెళ్లి కూడా చేసి అల్లుడిని కూడా తమతో పాటే ఉంచుకొని నివసిస్తోంది. కాగా.. రోమా ఈ నెల 9వ తేదీ రాత్రి తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేసి హిమాయత్ సాగర్ చెరువు వద్ద ఉన్న చౌడమ్మ గుట్ట ప్రాంతంలో పడవేసింది. అయితే మేరేకా కనిపించకపోవడంతో.. అల్లుడు ప్రశాంత్ అత్తా కనిపించడం లేదని రాజేంద్రనగర్ పోలీసులకు ఈ నేల 9వ తేదీ అర్ధరాత్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. శనివారం ఉదయం చౌడమ్మ గుట్ట వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహం మేరేకాదిగా గుర్తించారు. మేరేకా మృతి గురించి కూతురును విచారిస్తుండగా.. పోలీసులకు అనుమానం కలిగింది. దాంతో రోమాను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. రోమా, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.