- రిటైర్మెంట్ తర్వాత పెద్ద పోస్టులిస్తున్న సర్కారు
- ప్రభుత్వ సలహాదారుల్లో ఏడుగురు రిటైర్ అయినోళ్లే
- ఒక్కొక్కరికి రూ. 2 లక్షల జీతం, ఆఫీస్, స్టాఫ్, కారు
- అందుకోసం నెలకు రూ. కోటి దాకా ఖర్చు
హైదరాబాద్, వెలుగు: ఉన్నత స్థానాల్లో రిటైర్ అవుతున్న తమ అనుకూల ఆఫీసర్లకు రాష్ట్ర ప్రభుత్వం సలహాదారు పోస్టులు ఇస్తున్నది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతున్నది. అడ్వయిజర్ పోస్టులతో ప్రతి నెలా దాదాపు రూ. ఒక కోటి వరకు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు అవుతున్నట్లు తెలుస్తోంది. వీరికి రూ. లక్షల్లో జీతాలు, వసతులు, ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. అడ్వయిజర్స్ నుంచి ఏం సలహాలు వస్తున్నయో.. ప్రభుత్వం వాటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో పక్కన పెడితే.. వాళ్ల మనిషి అనుకుంటే చాలు రిటైర్ అయిన తర్వాత ఏదో ఒక అడ్వయిజర్ పోస్టు పక్కా అని ఐఏఎస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది.
ప్రస్తుత సలహాదారుల్లో..!
వివిధ పోస్టుల్లో రిటైర్ అయినవాళ్లు ప్రస్తుతం ఏడుగురు ప్రభుత్వ సలహాదారులుగా కొనసాగుతున్నారు. చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన రాజీవ్ శర్మ ప్రస్తుతం ముఖ్య సలహాదారుగా ఉన్నారు.
సీఎస్ హోదాలో పదవీ విరమణ పొందిన ఎస్.కె. జోషి ప్రస్తుతం ఇరిగేషన్ అడ్వయిజర్గా ఉన్నారు. 2012లో రిటైర్ అయిన కె.వి.రమణాచారి ప్రస్తుతం ప్రభుత్వ చీఫ్ అడ్వయిజర్ గా కొనసాగుతున్నారు. మొన్న పీసీసీఎఫ్ హోదాలో పదవీ విరమణ చేసిన శోభను అదే రోజున అడ్వయిజర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ అనురాగ్ శర్మ, రిటైర్డ్ ఐపీఎస్ ఏకే ఖాన్ కూడా సలహాదారులుగా కొనసాగుతున్నారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో జీఆర్ రెడ్డి అడ్వయిజర్గా కొనసాగుతున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ శివశంకర్ స్పెషల్ ఆఫీసర్గా, రిటైర్డ్ ఐఏఎస్ రామచంద్రుడు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు.
ఆఫీస్.. కారు.. ఇతరత్రా ఖర్చులు
ప్రభుత్వ సలహాదారులుగా ఉన్నవారికి స్పెషల్గా ఆఫీస్ సౌకర్యం కల్పించడంతో పాటు.. వెహికల్, ముగ్గురు స్టాఫ్, ఇతర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నది. ఒక్కొక్కరికి జీతాలు రూ. 2 లక్షలపైనే ఉన్నట్లు తెలిసింది. ఇలా జీతాలు, ఇతర అవసరాలకు కలిపి నెలకు రూ. కోటి దాకా ఖర్చు అవుతుండగా.. ఏడాదికి రూ.12 కోట్లు అవుతున్నాయి. కొందరికి కేబినెట్ హోదా కూడా సర్కార్ కల్పించింది. ఏపీలో ఎక్కువ మంది అడ్వయిజర్లు ఉండటంపై గతంలో అక్కడి హైకోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాధనం ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది. కొందరు అడ్వయిజర్లకు ఉన్న స్పెషల్ ఫెసిలిటీస్ న్యాయమూర్తులకు కూడా లేవని వ్యాఖ్యానించింది. అచ్చం అట్లనే తెలంగాణలో కొందరు ప్రభుత్వ సలహాదారుల తీరు ఉందని ఉన్నత హోదాలో ఉన్న కొందరు ఐఏఎస్ ఆఫీసర్లు చెప్తున్నారు. వెయిటింగ్ పోస్టు తీయాలన్నా.. ఏదైనా డిపార్ట్మెంట్కు వెళ్లాలనే ఇష్టాన్ని వ్యక్తపరచాలనుకున్నా రాష్ట్ర చీఫ్ అడ్వయిజర్ గా ఉన్న రిటైర్డ్ ఆఫీసర్ దగ్గర చెప్పుకుంటే చాలు.. పని అయిపోతుందనే చర్చ జరుగుతున్నది.
మనోళ్లు కాదు అనుకుంటే మధ్యలోనే..
ప్రభుత్వానికి కాస్త అనుకూలంగా అనిపియ్యకపోయినా.. ఆ ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ మధ్యలోనే రాజీనామా చేసి వెళ్లే పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. ఇందులో ఆకునూరి మురళి, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, వీకే సింగ్లాంటి వాళ్లు ఉన్నారు. ఇక గతంలో సీఎస్గా నియమితులైన రెండు నెలలకే ప్రదీప్ చంద్ర రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అంతకుముందు సీఎస్ హోదాలో ఉన్న ఐఏఎస్లకు ఎక్స్టెన్షన్ ఇచ్చిన సర్కార్.. ప్రదీప్ చంద్ర అనుకూలంగా లేకపోవడంతోనే అలా చేసిందని అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. ఇప్పటికీ కొంతమంది సీనియర్ ఐఏఎస్లకు లూప్ పోస్టులు ఇచ్చి, అనుకూలంగా ఉన్నవారికి మంచి డిపార్ట్మెంట్లను కేటాయించడంతో పాటు మూడు, నాలుగు శాఖల బాధ్యతలను అప్పగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.