హైదరాబాద్ శివారులో ఆఫ్రికన్ల పార్టీ.. అంతా ఉగాండా, కెన్యా, నైజీరియాలకు చెందిన వారే

హైదరాబాద్ శివారులో ఆఫ్రికన్ల పార్టీ.. అంతా ఉగాండా, కెన్యా, నైజీరియాలకు చెందిన వారే

చేవెళ్ల, వెలుగు: అనుమతులు లేకుండా మద్యంతో ఫాంహౌస్‎లో బర్త్​ డే పార్టీ చేసుకుంటున్న ఆఫ్రికన్లను సైబరాబాద్​పోలీసులు అరెస్ట్​చేశారు. రాజేంద్రగనర్ డీసీపీ శ్రీనివాస్​ కథనం ప్రకారం.. ఉగాండా, కెన్యా, లిబేరియన్, నైజీరియా, కామెరాన్ ​దేశాలకు చెందిన పలువురు కొంతకాలంగా హైదరాబాద్‎లోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఉగాండా దేశానికి చెందిన 'మమ' అనే మహిళ బర్త్​డే ఉండడంతో ఆమె రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​పరిధిలోని బాకారం జాగీర్​రెవెన్యూలోని ఎస్కే నేచర్​రిట్రీట్​ఫాంహౌస్లో గురువారం రాత్రి పార్టీ ఏర్పాటు చేసింది. 

ఈ పార్టీకి ఉగాండాకు చెందిన 34 మందితో పాటు కెన్యా, లిబేరియన్, నైజీరియా, కామెరూన్ ​దేశాలకు చెందిన 17 మంది వచ్చారు. కేక్ ​కటింగ్​తర్వాత మద్యం సేవిస్తుండగా స్థానిక పోలీసులు, ఎస్​వోటీ పోలీసులు దాడి చేశారు. 14 మంది పురుషులు,37 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 12 మంది స్టూడెంట్స్​కూడా ఉన్నారు.

డ్రగ్స్, గంజాయి తీసుకుని ఉంటారేమో అన్న అనుమానంతో నార్కోటిక్స్, ఎక్సైజ్​ పోలీసులు పరీక్షలు చేశారు. ఇందులో కొందరికి గంజాయి పాజిటివ్​ వచ్చింది. అనుమతి లేకుండా తీసుకువచ్చిన 90 విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పర్మిషన్​లేకుండా మద్యంతో పార్టీ చేసుకోవడం, విపరీతమైన సౌండ్​ పెట్టినందుకు కేసులు నమోదు చేశారు. 

గడువు ముగిసినా ఇక్కడే..

36 మంది వీసా, పాస్​పోర్టు గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్నారని గుర్తించారు. ఆరుగురు మహిళలు, తొమ్మిది మంది పురుషుల దగ్గరే వ్యాలిడ్​వీసా ఉందని గుర్తించి వీరిని వదిలిపెట్టారు. వీసా ఎక్స్​పైర అయి, పాస్​ పోర్ట్​ రెన్యూవల్​చేసుకోని వారిని వారి దేశం పంపించడానికి పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.