ముల్కీల రక్షణకు ప్రజల సంఘం

 ముల్కీల రక్షణకు ప్రజల సంఘం

ఏడో నిజాం మీర్​ ఉస్మాన్​ అలీఖాన్​ జారీ చేసిన 1919 ఫర్మానా తర్వాత  అక్కడక్కడ నాన్​ముల్కీలను స్థానిక ఉద్యోగాల్లో నియమించారు. 1920లో ముల్కీ ఉస్మానియా గ్రాడ్యుయేట్​ అసోసియేషన్​ ఏర్పాటైంది. అనంతరం 1926లో లండన్​లో విద్యను అభ్యసిస్తున్న హైదరాబాద్​ విద్యార్థులు ది సొసైటీ ఆఫ్​ యూనియన్​ అండ్​ ప్రోగ్రెస్ అనే సంస్థను స్థాపించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించిన విద్యార్థులు చదువును ముగించుకున్న తర్వాత ఉద్యోగాలకు ప్రయత్నించగా ప్రభుత్వం నాన్​ ముల్కీలను మాత్రమే ఉద్యోగాల్లో నియమించడంతో ఉద్యోగాలు లేకుండా పోయాయి. దీంతో ముల్కీలైన విద్యార్థులకు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరిగి మళ్లీ ముల్కీ ఉద్యమానికి దారితీసింది. వీటికితోడుగా 1930లో పంజాబ్​ ప్రాంతానికి చెందిన ఖాన్​ సాహెబ్​లు హైదరాబాద్​ సంస్థానానికి వచ్చి అనేక ఉన్నత ఉద్యోగాల్లో చేరారు. దీంతో స్థానికుల పదోన్నతులు దెబ్బతిని మళ్లీ ముల్కీ ఉద్యమం బలంగా బయలుదేరింది. 

రాజ్యాంగ సంస్కరణల కమిటీ

1937లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్​ హైదరాబాద్​ రాజ్యంలోని రాజ్యాంగ సంస్కరణల నిమిత్తం అరవముదు అయ్యంగార్​ నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 1938లో అనేక రాజ్యాంగ సంస్కరణలను సూచిస్తూ తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ నివేదికలో ఉద్యోగాలకు సంబంధించి స్థానికులకే అధిక ప్రాధాన్యం ఇవ్వడానికి ఇప్పటివరకు జారీ చేసిన ఫర్మానాలను చిత్తుశుద్ధితో అమలు చేయాలని సూచించింది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల నియామకానికి ప్రత్యేకమైన యంత్రాంగాన్ని రూపొందించాలని తెలిపింది. ఈ కమిటీ సూచనల ఆధారంగా 1919 ఫర్మానాలోని ఆర్టికల్​ 39ను 1945 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేశారు.
 ​  
నిజాం ముల్కీ లీగ్​ 

ముల్కీల హక్కులు కాపాడటం, పౌరసత్వపు హక్కులు సంపాదించడానికి ప్రజలతో ఎన్నుకోబడిన శాసనసభకు జవాబుదారీ వహించే రాజకీయ సంస్కరణలు సాధించడానికి ఒక ప్రజా సంస్థ అవసరమని భావించి నిజాం ప్రజల సంఘం లేదా నిజాం సబ్జెక్ట్స్​ లీగ్​ అనే సంస్థను స్థాపించారు. దీనినే ఉర్దూలో జమీయత్​ రిఫాయామే నిజాం అంటారు. ఈ సంస్థను 1934లో నిజాం ప్రజల సంఘాన్ని స్థాపించారు. ఈ సంఘం హైదరాబాద్​ ఫర్​ హైదరాబాదీస్​ అనే నినాదం ఇచ్చింది. దీని అధ్యక్షులు నవాబ్​ సర్​ నిజామత్​ జంగ్​. సర్​ నిజామత్​ జంగ్​ నిజాం మంత్రి మండలిలో రాజకీయ శాఖ మంత్రిగా పనిచేసి 1930లో పదవి నుంచి తప్పుకున్నారు. 

ఉపాధ్యక్షులు : డాక్టర్​ లతీఫ్​ సయిద్​, రామచంద్రా నాయక్​, కార్యదర్శులు: సయిద్​ ఆబిద్​ హసన్​, బూర్గుల రామకృష్ణారావు, శ్రీనివాస శర్మ, కార్యదర్శి: బారిస్టర్​ నౌషీర్​ చీనాయ్​, కార్యవర్గ సభ్యులు: ఈ సంస్థ 18 మంది సభ్యులతో కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. 
రాజ బహదూర్​ వెంకట్రామిరెడ్డి, నవాబ్​ షంషీర్​ జంగ్​, వామన్​ నాయక్​, అక్బర్ అలీఖాన్​, కాశీనాథరావు వైద్య, మాడపాటి హనుమంతరావు, అబుల్​ హసన్​ సయ్ద్​ అలీ, గోపాలరావు వకీలు, వి.వి.జోషి, శంకరరావు బోర్గాంకర్​, జనార్దన్​రావు దేశాయి, అహమద్​ మెహ్యద్దీన్​, ఖలీలుజ్జమా, మందుముల నరసింగరావు, మీర్​ హసనొద్దీన్​, శ్రీపతిరావు పల్​ నిట్కర్, నవాబ్​ మొయిన్​ యార్​ జంగ్​, నవాబ్​ బహదూర్​ యార్​ జంగ్​.

సంస్థ ఉద్దేశాలు 
* నిజాం సంస్థానంలోని అనేక కులాల, వర్గాలతో కూడిన ప్రజల్లో స్నేహభావాలను పెంపొందించి ఒకరినొకరు సహకరించుకోవాలనేటట్లు ప్రయత్నించడం
* దేశీయ హక్కులను కాపాడటం, ఆ హక్కుల వల్ల ఉత్పన్నమైన బాధ్యతల గురించి తెలియజేయడం
* ప్రభుత్వం శాసనసభకు బాధ్యత వహించే రాజ్యాంగ స్థాపనకు ప్రయత్నించడం
* హైదరాబాద్​ రాష్ట్రపు రాజరిక హక్కులను కాపాడటానికి ప్రయత్నించడం
* భారతదేశపు రాజ్యాంగ సమస్యకు పరిష్కార మార్గం, సమాఖ్య సంవిధానం ఒక్కటేనని ఈ సంస్థ విశ్వసిస్తుంది. 
* హైదరాబాద్​ రాష్ట్రం అవసరమైన రక్షణతో సమాఖ్యలో చేరి భారతదేశపు ప్రభుత్వం బాధ్యత నెరవేర్చడంలో పాలుపంచుకుంది. 
* అఖండ భారతదేశం సంక్షేమానికి తప్ప మరేదానికి కూడా త్యాగం చేయడానికి రాజీపడకూడదని ఈ సంస్థ విధానం విశదీకరిస్తుంది. 

నిజాం జన కేంద్ర సంఘం 

నిజాం రాష్ట్ర జనసంఘం స్ఫూర్తితో తెలంగాణలో అనేక సంస్థలు ఏర్పాటయ్యాయి. ఈ సంస్థలన్నింటిని కలిపి 1923 ఏప్రిల్​ 1న హన్మకొండలో నిజాం రాష్ట్ర జన కేంద్ర సంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి రాజగోపాల్​ రెడ్డి అధ్యక్షుడు. మాడపాటి హనుమంతరావు కార్యదర్శిగా వ్యవహరించారు. ఈ సంఘం ఆంధ్ర మహాసభ అవతరణ వరకు  తెలంగాణ సాంస్కృతిక, వైజ్ఞానిక పురోభివృద్ధికి కృషి చేసింది. దీనికి అనుబంధంగా ఆదిరాజు వీరభద్రరావు సారథ్యంలో ఆంధ్ర పరిశోధక సంఘం స్థాపించారు. కొమ్మరాజు లక్ష్మణరావు మరణానంతరం ఈ సంఘం లక్ష్మీనారాయణ పరిశోధక మండలిగా మారింది. వర్తక స్వేచ్ఛ, వెట్టి చాకిరి, మోతుర్భా మగ్గం పన్ను అనే కరపత్రాలు, నిజాం రాష్ట్ర ఆంధ్రులు, నిజామాంధ్ర రాష్ట్ర ప్రశంస, నిజాం రాష్ట్ర అభివృద్ధి మార్గాలు అనే లఘు పుస్తకాలు ప్రచురించింది. 1930లో వరంగల్​లో కాకతీయుల చర్చాగోష్టి పేరుతో నిర్వహించిన సభ అనంతరం వరంగల్​ నుంచి కాకతీయ సంచిక వెలువడింది.