గత 50 ఏళ్లలో ఇదే రికార్డు ధర
మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై దోపిడీ
ఇబ్బందులు పడుతున్న సామాన్యులు
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో రైతులు వానాకాలం వడ్లు అమ్ముకు న్న తర్వాత బియ్యం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. మిల్లర్లు, వ్యాపారులు కుమ్మక్కై అడ్డగోలుగా ధరలు పెంచి దోపిడీకి తెర తీశారు. దీంతో బియ్యం కొనడానికి మార్కెట్ కు వెళ్లిన ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. దానికి కారణం గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త బియ్యం క్వింటాల్ రూ.4,400 పెరగడమే. గత 50 ఏండ్ల నుంచి క్వింటాల్ రూ.3,500 నుంచి రూ.3,600 మధ్య ఉన్న కొత్త సన్న బియ్యం ధరను కేవలం15రోజుల్లోనే క్వింటాల్కు రూ.500 నుంచి రూ.800 లకు పెంచేశారు మిల్లర్లు. సంక్రాంతి ముందు కూడా 4 వేల లోపే ఉన్న ధర ఆ తరువాత ఒక్కసారిగా రూ.400 జంప్ అయ్యింది. డిసెంబరు నుంచి ఇప్పటిదాకా బియ్యం ధరలు మూడు సార్లు పెరగడానికి మిల్లర్ల మాయాజాలమే కారణమని స్పష్టంగా తెలుస్తోంది. రోజుల వ్యవధిలోనే బియ్యం రేటు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పాత బియ్యం రూ.5,500 నుంచి రూ.6,500
మార్కెట్లో పాత సన్నబియ్యం క్వింటాల్ రూ.5500 నుంచి రూ.6500 వరకు ధరలు పలుకుతున్నాయి. సాధారణ సన్న రకాలు ప్రస్తుతం కిలో రూ.46 నుంచి రూ.58 వరకు ఉన్నాయి. కర్నూల్ సోనా కిలో రూ. 58, వరంగల్ రూ.55 కు అమ్ముతున్నారు. బియ్యం ధరల పెరుగుదలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మరింతగా ఇబ్బంది పడాల్సి వస్తుందని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాగు పెరిగినా తగ్గని ధరలు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ వరి సాగు గణనీయంగా పెరిగింది. గత సీజన్లో 64.30లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి సివిల్ సప్లయ్స్ కొనుగోలు చేసింది. మిల్లర్లు కూడా రైతుల నుంచి మరో 40 లక్షల టన్నుల ధాన్యాన్ని నేరుగా కొనుగోలు చేసినట్లు అంచనాలు ఉన్నాయి. వానాకాలంలో దాదాపు కోటీ 20 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సివిల్ సప్లయ్స్ నిర్ణయించగా.. అందులో 60 శాతం టార్గెట్ రీచ్ అయ్యింది. మిల్లర్లు నేరుగా రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో సర్కారు కొనుగోళ్లు తగ్గాయి. దీంతో ఈయేడు యాసంగిలో వరి సాగు పెరిగినా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు మాత్రం తగ్గడం లేదు. సన్న బియ్యం కొనాలంటే కనీసం రూ. 50 పెట్టనిదే దొరికే పరిస్థితి లేదు. బియ్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నా సర్కారు పట్టించుకోవడం లేదు. తక్కువ ధరలకు వినియోగదారులకు బియ్యం అందేలా చూడాల్సిన సర్కారు.. ధరలకు కళ్లెం వేసేందుకు ఏమాత్రం చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
కృత్రిమ కొరత సృష్టిస్తున్నరు
రాష్ట్రంలోని మిల్లర్లు వాళ్ల దగ్గరున్న స్టాక్లో ఇప్పటికే కొంత వరకు పక్క రాష్ట్రాలకు అమ్ముకున్నరు. దీని వల్ల మన దగ్గర వరి సాగు పెరిగినా మిల్లర్లు చేస్తున్న అక్రమాల వల్ల కృత్రిమ కొరత ఏర్పడుతోంది. అందువల్లే 15 రోజుల్లో బియ్యం ధరలు రూ.500 నుంచి రూ.800 వరకు పెరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కారు చర్యలు తీసుకోకపోతే వచ్చే రెండు నెలల్లో మరో రూ.500 వరకు పెరిగే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వానాకాలంలో సన్న రకాలను కొన్న మిల్లర్లు కృత్రిమ కొరత సృష్టిస్తుండగా.. యాసంగిలో సన్నలు వేసిన నల్గొండ, సూర్యపేట్ జిల్లాల్లో అగ్గి తెగులు ప్రభావం ఉందని అంటున్నారు. దీని వల్ల మిల్లర్లు వరి దిగబడి తగ్గుతుందని అంచనా వేసి, ముందే బియ్యం ధరలు పెంచేసినట్లు తెలుస్తోంది.