
‘ద కశ్మీర్ ఫైల్స్’ లాంటి సంచలన విజయం తర్వాత దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఎలాంటి సినిమా చేయబోతున్నాడు అనే ఆసక్తి నెలకొంది. ఇటీవల సుకుమార్ కాంబినేషన్లో ఓ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేసిన వివేక్, దానికంటే ముందు మరో సినిమాని స్టార్ట్ చేస్తున్నారు. గురువారం ఆయన బర్త్ డే సందర్భంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘ద వ్యాక్సిన్ వార్’ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పల్లవి జోషి నిర్మిస్తున్నారు. ‘ద కశ్మీర్ ఫైల్స్’ నిర్మాత అభిషేక్ అగర్వాల్ సమర్పకులు. కొవిడ్ వ్యాక్సిన్ బ్యాక్డ్రాప్లో బయో సైంటిస్టుల విజయాన్ని చాటిచెబుతూ, వారి త్యాగం, అంకితభావం కృషికి నివాళిగా ఈ సినిమా వుంటుంది’ అని మేకర్స్ చెప్పారు. ‘మీకు తెలియని యుద్ధంలో మీరు పోరాడి గెలిచారు’ అనే క్యాప్షన్ ఇచ్చారు. త్వరలో షూటింగ్ ప్రారంభించి, వచ్చే ఏడాది ఆగస్టు 15న 11 భాషల్లో విడుదల చేయనున్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు, తమిళ, కన్నడ, గుజరాతీ, పంజాబీ, భోజ్పురి, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ, అస్సామీ భాషల్లో విడుదల కానుంది. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.