హైదరాబాద్, వెలుగు: రెగ్యులరైజ్ చేయాలంటూ గత నెలలో ఎల్బీనగర్ వెటర్నరీ సెక్షన్కు చెందిన 51 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులు సమ్మెలో పాల్గొనగా.. అధికారులు వారినివిధుల్లో నుంచి తొలగించారు. దీనిపై బాధిత బాధిత కార్మికులు హైకోర్టును ఆశ్రయించారు. 10–15 ఏండ్లుగా పనిచేస్తున్న తమను అకారణంగా విధుల్లోంచి తొలగించారని కోర్టుకు విన్నవించారు. కార్మికులను ఎందుకు తొలంగించారో తెలపాలని ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, ఎల్బీనగర్ జోనల్ కమిషనర్, ఎల్ బీనగర్ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీకి హైకోర్టు శుక్రవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ముఖ్య విభాగం కావడంతో నోటీసులు లేకుండా సమ్మె నిర్వహించారని, అందుకే కొత్తవారిని తీసుకోవాల్సి వచ్చిందని అధికారుల తరఫున ప్రభుత్వ లాయర్లు హైకోర్టుకు విన్నవించారు. కార్మికుల వివరాలు సమర్పించడంతో పాటు వచ్చేనెల 4 లోపు కౌంటర్ దాఖలు చేయడంతో పాటు కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు కార్మికులను యధావిధిగా కొనసాగించాలని ఏజెన్సీని కోర్టు ఆదేశించింది.