- గోల్కొండ ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లో ఫస్ట్ బ్యాచ్లో 300 మందికి శిక్షణ
హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అగ్నివీర్ స్కీమ్ లో భాగంగా హైదరాబాద్ గోల్కొండలోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్లో ఫస్ట్ బ్యాచ్లో 300 మందికి ట్రైనింగ్ స్టార్ట్ అయింది. గత ఏడాది జూన్లో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రారంభించింది. సెప్టెంబర్లో జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ను ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ముందుగా ఆర్మీ జవాన్లను రిక్రూట్ చేస్తున్నారు. ఆ వివరాలను సోమవారం బ్రిగేడియర్ రాజీవ్ చౌహాన్ వెల్లడించారు. గోల్కొండలోని ఆర్టిలరీలో శిక్షణ కోసం 300 మంది అగ్నివీర్లను కేంద్రం కేటాయించింది.
వీరికి 31 వారాల పాటు ఆర్మీ అధికారులు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వీరితో పాటు ఫిబ్రవరిలో మరో 2,265 మందికి, ఆ తర్వాత 3,300 మందికి ట్రైనింగ్ ప్రారంభించనున్నారు. ఇక్కడి నుంచే 5,500 మంది అగ్నివీర్లను సైన్యంలో చేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 30కి పైగా ఫిజికల్ ట్రైనింగ్ గ్రౌండ్స్ ఏర్పాటు చేశారు. 50 మీటర్ల నుంచి 200 మీటర్ల వరకు ఫైరింగ్ రేంజ్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇన్ఫ్యాట్రీ వెపన్ ట్రైనింగ్ సిమిలేటర్ ల్యాబ్ ద్వారా డిజిటల్ షూటింగ్ చేయిస్తున్నారు. పాయింట్స్ ప్రకారం ట్రైనింగ్లో వెయిటేజ్ ఇస్తున్నారు. అత్యాధునిక పరికరాలు, ఫైరింగ్, శారీరక, మానసిక స్థైర్యాన్ని నింపేలా అధికారులు అగ్నివీర్లను తీర్చి దిద్దుతున్నారు.