
- అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలె: తుమ్మల
- రాష్ట్రంలో 84.43 లక్షలప్యాకెట్ల కాటన్ సీడ్ సప్లై
- అందుబాటులో 97,109 క్వింటాళ్ల గ్రీన్ మెన్యూర్ సీడ్స్
- వర్షాల నేపథ్యంలో వ్యవసాయ మంత్రి రివ్యూ
హైదరాబాద్, వెలుగు: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించడం, వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహిచారు. వచ్చే మూడు నాలుగు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలకు ఒక మోస్తరు నుంచి భారీ వర్ష సూచన ఉన్నదని వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అన్ని జిల్లాలకు సరఫరా చేసిన పచ్చరొట్ట, పత్తి విత్తనాల ప్యాకెట్లను రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. సోమవారం నాటికే రాష్ట్రవ్యాప్తంగా పత్తి విత్తనాలు 84,43,474 ప్యాకెట్లు సప్లై జరిగిందన్నారు. ఇప్పటికే రైతులు 25,10,430 పత్తి ప్యాకెట్లు కొనుగోలు చేశారని తెలిపారు. కంపెనీ వారీగా సరఫరా సమీక్షించి, ప్రణాళిక ప్రకారం ఇంకా రాష్ట్రానికి సరఫరా చేయాల్సిన ప్రత్తి ప్యాకెట్లను మూడు రోజుల్లో రైతులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
పచ్చిరొట్ట విత్తనాలు నిరుడు ఇదే టైమ్ నాటికి 37,959.60 క్వింటాళ్లు రైతులు కొనుగోలు చేయగా, ఈసారి 97,109 క్వింటాళ్లు అందుబాటులో ఉంచారు. రైతులు ఇప్పటికే 84,412 క్వింటాళ్లు కొనుగోలు చేశారని మంత్రి తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే విత్తనాలు నాలుగైదు రోజుల్లో రైతులకు అందుబాటులోకి వస్తాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో పచ్చిరొట్ట విత్తనాలను ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేసి పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
వ్యవసాయ శాఖ అనుమతి లేకుండా పత్తి విత్తనాల ప్యాకెట్లు విక్రయిస్తున్న 33 మందిపై కేసులు పెట్టి రూ.2.49 కోట్ల విలువైన 118.29 క్వింటాళ్ల విత్తనాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారని ఇద్దరు డీలర్లపై కేసు పెట్టామన్నారు. పత్తి విత్తనాలు మార్కెట్లలో అవసరం మేర అందుబాటులో ఉన్నాయని, రైతులు అధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేయాలని మంత్రి సూచించారు.