వానాకాలం సాగు ప్రణాళిక రెడీ .. సంగారెడ్డి జిల్లాలో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు

వానాకాలం  సాగు ప్రణాళిక రెడీ .. సంగారెడ్డి జిల్లాలో 2.98 లక్షల హెక్టార్లలో పంటలు
  • 1.43 లక్షల హెక్టార్లలో వరి పంట
  • 237 హెక్టార్లలో జొన్న పంట
  •  ఈ సీజన్ నుంచే ఫసల్ బీమా

సంగారెడ్డి, వెలుగు: జిల్లాలో వానాకాలం సీజన్​కు వ్యవసాయ అధికారులు సాగు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,98,718.22 హెక్టార్లలో పంటలు పండించనున్నట్టు సమాచారం. ఇందులో ప్రధాన పంటగా పత్తి, రెండో పంటగా వరి, ఆ తర్వాత కంది, సోయాబీన్, పెసర, మినుము, చెరుకు, జొన్న పంటలు ఉన్నాయి. బీఆర్ఎస్ హయాంలో వరి వేయొద్దని ప్రచారం జరగడంతో చాలామంది రైతులు వెనుకడుగేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న క్రమంలో వరి సాగుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు ఈ సీజన్ నుంచి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు

జిల్లాలో పంటల సాగు ఇలా..

జిల్లాలో 1,43,817.81 హెక్టార్లలో ప్రధాన పంటగా పత్తి సాగు కానుంది. వరి 59,424.7 హెక్టార్లలో, కంది 32,044.53, సోయాబీన్ 29,817.81, హార్టికల్చర్ లో 9,898.79, చెరుకు 7,957.09, పెసర 5,749.39, మినుము 3,465.59, మొక్కజొన్న 3,441.3, జొన్న 237.5 హెక్టార్లలో సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. వీటితో పాటు రాగులు, సామలు, కొర్రలు, ఉలవలు, ఎర్ర జొన్నలు, స్వీట్ కార్న్, ఆవాలు, వేరుశెనగ, గడ్డి నువ్వులు, అనుములు, బొబ్బర్లు, ఆవాలు, పొద్దుతిరుగుడు పంటలు తక్కువ మోతాదులో సాగు చేయనున్నారు.

విత్తన కొరత లేకుండా..  

జిల్లాలో విత్తనాల కొరత లేకుండా వ్యవసాయ శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. పంటల సాగుకు అనుగుణంగా ఎరువులను సేకరించి పంపిణీ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో పచ్చి రొట్టె విత్తనాలైనా జనము 6,500, జీలుగు 4,500 క్వింటాళ్లు కలిపి మొత్తం 11 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉన్నట్టు ప్రతిపాదనలు పంపింది. ఈసారి వరిసాగు పెరుగుతున్నందున విత్తనాల కొరత ఏర్పడకుండా అధికారులు పక్కా ప్లాన్ చేస్తున్నారు. నకిలీ విత్తనాలను నివారించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ సీజన్ నుంచే ఫసల్ బీమా

ఫసల్ బీమా పథకాన్ని ఈ సీజన్ నుంచి అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా, రైతు వాటా ఎంత అనే దానిపై విధి విధానాలు ఖరారు చేయనున్నారు. వాతావరణ ఆధారిత బీమా కింద పత్తి, ఆయిల్ పామ్, టమాట, బత్తాయి, మిరప, మామిడి పంటలకు బీమా వర్తించనుండగా, దిగుబడి ఆధారిత బీమా కింద వరి, మొక్కజొన్న, మినుము, నువ్వులు, సోయాబీన్, కంది, వేరుశెనగ పంటలకు అమలు చేయనున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దిగుబడుల్లో నష్టం జరిగితే వాటికి సంబంధించి పక్షం రోజుల్లోనే రైతుకు పరిహారం అందిస్తారు.