
- మృతుల్లో 241 మంది ప్రయాణికులు,24 మంది మెడికోలు, ఇతరులు
- గాయపడినవాళ్లలో మరికొంత మంది పరిస్థితి సీరియస్
- మృతుల సంఖ్య పెరిగే అవకాశం
అహ్మదాబాద్: గుజరాత్ అహ్మదాబాద్లో ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం కూలిన ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 265కు పెరిగింది. మృతుల్లో 241 మంది ప్రయాణికులు కాగా, మిగిలిన 24 మంది బీజే మెడికల్ కాలేజీ స్టూడెంట్లు, డాక్టర్లు, ఇతరులు ఉన్నారు. మార్చురీకి 265 డెడ్బాడీలు వచ్చినట్లు సివిల్ హాస్పిటల్ మేనేజ్ మెంట్ శుక్రవారం స్పష్టం చేసింది. అటు పోలీసులు కూడా మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన చేశారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి గురువారం లండన్ బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్ విమానం.. టేకాఫ్ అయిన 38 సెకండ్లలోనే బీజే మెడికల్ కాలేజీ, హాస్పిటల్పై కూలిపోయింది.
విమానంలో 242 మంది ప్రయాణికులు ఉండగా.. 40 ఏండ్ల విశ్వాస్ కుమార్ రమేశ్ అనే యూకే పౌరసత్వం కలిగిన ఇండియన్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక, బీజే మెడికల్ కాలేజీ, హాస్పిటల్ క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఐదుగురు ఎంబీబీఎస్ స్టూడెంట్లు, ఓ పోస్ట్గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్, ఓ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ భార్య, వంట మనిషి ఇతర స్టాఫ్, కార్మికులు సహా మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా స్టూడెంట్లు గాయపడ్డారు. వీరిలో చాలామంది కండీషన్ సీరియస్గా ఉన్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
ఆరు డెడ్ బాడీల అప్పగింత
ఎయిరిండియా విమాన ప్రమాదంలో మృతి చెందిన 265 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్కు తరలించారు. వీటిలో 6 డెడ్ బాడీలను గుర్తించి, కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఈ డెడ్ బాడీలు మాత్రమే ముఖాలు గుర్తుపట్టే విధంగా ఉన్నాయని, మిగతావి గుర్తించ లేనంతగా కాలిపోవడంతో వాటి శాంపిల్స్ ను డీఎన్ఏ పరీక్షలకు పంపుతున్నట్టు తెలిపారు. 215 మంది మృతుల కుటుంబసభ్యులు డీఎన్ఏ పరీక్షలకు తమ శాంపిల్స్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారన్నారు. డీఎన్ఏ శాంపిల్స్ మ్యాచింగ్కు కనీసం 72 గంటల సమయం పడుతుందని, ఆ ఫలితాలు వచ్చిన తర్వాత డెడ్ బాడీలను సంబంధిత కుటుంబసభ్యులకు అప్పగిస్తామన్నారు.