అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఇక కొద్దిక్షణాల్లో చావు తప్పదని తెలిస్తే.. మానసిక స్థితి ఎలా ఉంటుందంటే..

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ఇక కొద్దిక్షణాల్లో చావు తప్పదని తెలిస్తే.. మానసిక స్థితి ఎలా ఉంటుందంటే..

ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఇచ్చే సంకేతమే మేడే కాల్.  పరిస్థితి చేయిదాటిపోయి, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఆ సందేశాన్ని ఎయిర్ కంట్రోల్ ట్రాఫిక్ వారికి తెలిపే విధంగా పైలట్.. ‘మేడే  మేడే  మేడే’ అంటూ మూడుసార్లు పలుకుతాడు. సులువుగా పలకగలిగే పదంగా దీన్ని ఎంచుకున్నారు. ఒక రకంగా ఇది ఎస్ఓఎస్ (సేవ్ అవర్ సోల్స్)లాంటిది.

బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 విమాన పైలట్ పంపిన సంకేతానికి స్పందించి సంబంధిత సహాయాన్ని అందించే సమయం ఏమాత్రం లేకుండా దురదృష్టకరమైన దుర్ఘటన క్షణాల్లో జరిగిపోయింది. మధ్యాహ్నం 1:10 గంటలకు అహ్మదాబాద్‌ నుంచి టేకాఫ్‌ తీసుకున్న బోయింగ్ డ్రీమ్‌లైన్ 787 విమానం క్షణాల వ్యవధిలోనే అహ్మదాబాద్ మెగాని ప్రాంతంలో కుప్పకూలడం దేశ ప్రజలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది.  భారతదేశ వైమానిక చరిత్రలో ఇది అత్యంత విషాదకరమైన ఘట్టం, మాటల్లో చెప్పలేని హృదయ విదారకర ఘటన. ఈ విమానంతో, అందులోని ప్రయాణికులతో ఏమాత్రం సంబంధం లేకున్నా సదరు ప్రమాదం వల్ల వసతి గృహంలో భోజనం చేస్తూ దుర్మరణం పాలైన వైద్య విద్యార్థులు కూడా ఉన్నారు. వీరు విధి వంచితులుగా మారడం తీరని వేదనను మిగిల్చింది.  

భావోద్వేగాలకు కూడా లేని సమయం
విమాన ప్రమాదాన్ని పసిగట్టి ఇక కొద్దిక్షణాల్లో మరణం తప్పదు అని తెలుసుకున్న ప్రయాణికుల మానసిక స్థితి ఎలా ఉంటుందో  తలుచుకుంటేనే మనం నీరుగారిపోతాం. ఇక అతి త్వరలో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని స్వయంగా తెలుసుకున్న బాధితులు శారీరక,  మానసిక ప్రతిస్పందనలతో కూడిన అత్యంత విషాదమైన అనుభూతిని పొందుతారు. ఒత్తిడి హార్మోన్ల విడుదల కారణంగా భయాందోళన,‌ చెమట, వణుకు, వేగంగా గుండె కొట్టుకోవడం వంటి శారీరక లక్షణాలను అనుభవిస్తారు. అతి కొద్దిమంది మాత్రమే ఏదైతే అది అయ్యింది అన్న గుండె నిబ్బరంతో ఉంటారు. 

నిశ్చల స్థితిలో  భగవన్నామ స్మరణ చేస్తారు. మరికొంతమంది వారి వ్యక్తిగత విధానాలతో కఠిన సవాళ్లను ఎదుర్కొనే పద్ధతులను పాటిస్తారు. అధిక సంఖ్యాకులు మాత్రం అంగీకార పూర్వకంగా మానసికంగా నిష్క్రమిస్తారు. అయితే, ఇలాంటివేవి జరిగే అవకాశాలు లేకుండా ఏం జరుగుతుందో  ఊహించేలోపే రెప్పపాటు కాలంలో మరణ మృదంగం రూపంలో మేడే కాల్ వెళ్లిపోయింది. అది కూడా తెలియకుండా లిప్తకాలంలో అనాయాస మరణం పొందిన ప్రయాణికులకు, సిబ్బందికి ఉత్తమగతులు సంప్రాప్తించాలని కోరుకుని నివాళి అర్పిద్దాం. 

అత్యవసర ద్వారమే కాపాడింది 
విమాన ప్రయాణికులకు, సిబ్బందికి, వైద్య విద్యార్థులకు మృత్యు వలయంగా మారిన విధి.. అదే విమానంలో ఎక్కిన, ఎక్కవలసి ఉన్న ఇద్దరు ప్రయాణికులకు మాత్రం ఆయుష్షు నిలబెట్టింది.  గుజరాత్  మాజీ ముఖ్యమంత్రితో సహా విమానంలో ప్రయాణిస్తున్న 242 స్వదేశీ, విదేశీ ప్రయాణికుల  ప్రాణాలు రెప్పపాటు కాలంలో గాలిలో కలిసిపోగా మృత్యుంజయుడై బయటపడిన ఒకే ఒక్కడు  రమేష్ బిశ్వాస్.

చికిత్స పొందుతున్న మృత్యుంజయుడు మాట్లాడుతూ.. ఘోర ప్రమాదం నుంచి బయటపడి నేను ఎలా బతికినో నాకే నమ్మకం కుదరడం లేదు, ఒక క్షణం, షాక్లో ఉన్న నేను చనిపోతాననే అనుకున్నాను. కానీ,  కళ్ళు తెరిచి చూస్తే నేను బతికే ఉన్నానని గ్రహించాను అన్నాడు.  సీట్ బెల్ట్ తీసి చూస్తే అదృష్టవశాత్తు విరిగిపోయి పడి ఉన్న అత్యవసర తలుపు కనిపించింది. గాయాలతో బాధపడుతూనే అందులో నుంచి  బయటికి దూకి కూలిపోయిన భవన శిథిలాల మీదుగా నడిచి వచ్చి ప్రాణాలు కాపాడుకున్నాడు. 

ఆలస్యమే అమృతమైంది
ఆలస్యం అమృతం విషం అని నానుడి. ఆ విషమే తిరిగి అమృత తుల్యంగా మారవచ్చు. భూమి చౌహాన్ అనే మహిళ విషయంలో సరిగ్గా అదే జరిగింది. ఆవిడ లండన్ బయలుదేరడం కోసం ప్రమాదానికి లోనైన విమానంలో ప్రయాణించవలసి ఉంది.  విమానం ఎక్కవలసిన భూమి చౌహాన్ లేటుగా బయలుదేరి తనకు తెలియకుండా తన జీవితకాలాన్ని పెంచుకున్నారు. 

ఆర్ సి కుమార్, సామాజికవేత్త