
న్యూఢిల్లీ: అహ్మదాబాద్లో కుప్పకూలి.. పేలిపోయిన ఎయిర్ ఇండియా ఏఐ 171 విమానం నుంచి సేకరించిన బ్లాక్ బాక్స్ డ్యామేజ్ అయ్యింది.. ఓపెన్ కావటం లేదని.. డేటా డీకోడ్ కావటం లేదనే వార్తలు వస్తున్నాయి. ఈ బ్లాక్ బాక్స్ను ఓపెన్ చేసి.. అందులోని డేటాను సేకరించటానికి ఇండియాలో అవకాశం లేదని.. దీన్ని అమెరికా పంపించాలనే ఆలోచనలో ఉంది డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఈ బ్లాక్ బాక్స్ విదేశాలకు పంపించాలంటే.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి.. దీంతో ఈ అనుమతి కోసం సివిల్ ఏవియేషన్.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది.
2025, జూన్ 12న గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరింది.
ఎయిర్ పోర్టు నుంచి టేకాఫ్ అయిన నిమిషాల్లోనే విమానాశ్రయం సమీపంలోని చెట్టును ఢీకొని బీజీ మెడికల్ కాలేజీ హాస్టల్ భవనంపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో 241 మంది చనిపోగా.. ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. విమానం కూలిన మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంలోని దాదాపు 30 మంది మెడికోలు మృతి చెందినట్లు సమాచారం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విషాదాల్లో ఒకటిగా నిల్చిన అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణమేంటో తెలుసుకోవాలంటే ప్లయిట్లోని బ్లాక్ బాక్సే కీలకం.
ప్రమాదం సమయంలోని కాక్ పిట్ వాయిస్ రికార్డ్, ఎఫ్డీఆర్ ఎత్తు, వాయువేగం, శీర్షిక, నియంత్రణ ఉపరితల ఇన్పుట్లతో సహా ముఖ్యమైన విమాన డేటా ఈ బ్లాక్ బాక్స్లో స్టోర్ అవుతోంది. దీంతో ప్రమాద స్థలంలో జాతీయ దర్యాప్తు సంస్థలు బ్లాక్ బాక్స్ కోసం తీవ్రంగా గాలించాయి. చివరకు ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత బ్లాక్ బాక్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్లాక్ బాక్స్లోని డేటాను విశ్లేషించి ప్రమాదానికి కారణాలేంటో గుర్తించేందుకు ప్రయత్నించారు. కానీ విమాన ప్రమాద తీవ్రతకు బ్లాక్ బాక్స్ కూడా ధ్వంసమైనట్లు తెలుస్తోంది.
అందులోని డేటా డీకోడ్ కావడం లేదని.. బ్లాక్ బ్యాక్స్లోని డేటా రికవరీ కోసం అమెరికా పంపాల్సి రావొచ్చని జాతీయ మీడియా వార్తలు వస్తున్నాయి. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ (NTSB) ప్రధాన కార్యాలయానికి బ్లాక్ బాక్స్ను విశ్లేషణ కోసం పంపవచ్చు. బ్లాక్ బాక్స్ విదేశాలకు పంపించాలంటే.. కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి.. దీంతో ఈ అనుమతి కోసం సివిల్ ఏవియేషన్.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనుంది. బ్లాక్ బాక్స్ను విదేశాలకు పంపాల్సి వస్తే అన్ని ప్రోటోకాల్లు పాటించబడ్డాయని నిర్ధారించుకోవడానికి భారత అధికారుల బృందం బ్లాక్ బాక్స్తో పాటు వెళ్లనుంది. మరీ దీనిపై కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.