
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) భారీ అవకాశాలను కల్పిస్తుందని, దీని వల్ల దేశంలో ఉద్యోగాలు పెరుగుతాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. "నిర్ణయాలు తీసుకునే స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరి ఫోన్లలో లేదా ల్యాప్టాప్లలో చాట్జీపీటీ వంటి ఏఐ టెక్నాలజీల తాజా వెర్షన్లు ఉండాలని నేను మా ఆఫీసులో చెప్పాను" అని ఆయన తెలిపారు.
ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయని కొందరు అంటున్నప్పటికీ, దానిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ కొత్త టెక్నాలజీలను స్వీకరించడానికి సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ వల్ల అనైతిక ఉపయోగం వంటి సమస్యలు ఉన్నప్పటికీ, వాటిని పరిష్కరించడానికి మానవ ప్రమేయం అవసరమని వివరించారు. ఏఐ కారణంగా టీసీఎస్ వంటి కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న పరిస్థితుల్లో మంత్రి ఈ కామెంట్స్చేశారు.