చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏళ్ల పాటు తమిళనాడును పాలించిన అన్నాడీఎంకే పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ షాక్ నుంచి తేరుకోకముందే అన్నాడీఎంకేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణిల వర్గానికి చెందిన రెబల్ ఎమ్మెల్యే ఈశాకి సుబయ్య తన పదవికి రాజీనామా చేశారు.
ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ను కలిసి మంగళవారం (మే 26) తన రాజీనామా లేఖను సమర్పించారు. సుబయ్య రాజీనామాను స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆమోదించారు. దీంతో రెండు రోజుల్లోనే అన్నాడీఎంకేకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమ పదవులకు వీడ్కోలు పలికారు. రాజీనామా అనంతరం వీరంతా అధికార టీవీకే పార్టీలో చేరడం గమనార్హం. వీరి రాజీనామాలతో జరగనున్న ఉప ఎన్నికల్లో టీవీకే పార్టీ నుంచి వీరికి టికెట్ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎవరీ ఈశాకి సుబయ్య..?
2026 తమిళనాడు శాసనసభ ఎన్నికలలో అంబసముద్రం నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే తరుఫున ఈశాకి సుబ్బయ్య పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి విపీ దురైని 10,245 ఓట్ల తేడాతో ఓడించి సుబయ్య విజయం సాధించారు. సుబయ్యకు 65,5899 ఓట్లు రాగా.. దురైకి 55,344 ఓట్లు పడ్డాయి. అంబసముద్రంలో టీవీకే అభ్యర్థి ఎస్. రాజగోపాల్ 53,611 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచారు.
ALSO READ : ఇక నుంచి రోజుకు 5 షోలు
ఇక, ఎన్నికల అనంతరం అన్నాడీఎంకే రెండుగా చీలిన విషయం తెలిసిందే. సీవీ. షణ్ముగం, ఎస్పీ వేలుమణిల నేతృత్వంలో కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగరేశారు. ఈశాకి సుబ్యయ్య కూడా రెబల్ వర్గంలో చేరారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల వర్గం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి మద్దతు తెలిపింది. 2026, మే 13న అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు.
