
న్యూఢిల్లీ: హోమ్ షేరింగ్ కంపెనీ ఎయిర్బీఎన్బీ 2024లో భారతదేశంలో 1.11 లక్షల ఉద్యోగాలకు సపోర్ట్ చేసిందని, వేతనాల రూపంలో రూ. 2,400 కోట్లు అందించినట్లు వెల్లడయింది. ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం, 2024లో ఎయిర్బీఎన్బీ అతిథులు భారతదేశంలో రూ. 11,200 కోట్లు ఖర్చు చేశారు. వీరిలో 91 శాతం మంది దేశీయ పర్యాటకులే కావడం విశేషం. ఇది 2019లో 79 శాతం కంటే ఎక్కువ.
అంతర్జాతీయ అతిథులలో ఎక్కువ మంది అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. అతిథులు సగటున రెండు రాత్రులు బస చేసి, రోజుకు రూ. 11వేల ఖర్చు చేశారు. ఎయిర్బీఎన్బీ భారత దేశ పర్యాటక రంగ జీడీపీలో 0.5 శాతానికి, ఉద్యోగ కల్పనలో 0.2 శాతానికి సహకరించింది. గ్రామీణ ప్రాంతాల్లో బుకింగ్లు 2019 నుంచి మూడు రెట్లు పెరిగాయి. ఎయిర్బీఎన్బీ ఇండియా అండ్ సౌత్ఈస్ట్ ఆసియా కంట్రీ హెడ్ అమన్ప్రీత్ బజాజ్ మాట్లాడుతూ, దేశీయ పర్యాటకం భారత ఆర్థిక వ్యవస్థకు ప్రధాన వనరు అని చెప్పారు.