
ప్లేయర్లకు తప్పిన ‘కేబుల్’ ప్రమాదం
బ్యూనస్ ఎయిర్స్: ఫిఫా వరల్డ్కప్ నెగ్గి స్వదేశానికి చేరుకున్న అర్జెంటీనా ప్లేయర్లను చూసేందుకు లక్షలాది మంది ఫ్యాన్స్ పోటెత్తారు. బ్యూనస్ ఎయిర్స్ వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. ఎయిర్పోర్ట్ దగ్గర్లో ఉన్న అర్జెంటీనా ఫుట్బాల్ అసోసియేషన్ ఆఫీస్ నుంచి ఒబ్లెసిక్ స్మారక చిహ్నం వరకు నాలుగు గంటల పాటు ప్లేయర్లను ఓపెన్ టాప్ బస్లో ఊరేగించారు. అయితే, మధ్యలో కొన్ని చోట్ల ఫ్యాన్స్ సంబురాలు శ్రుతిమించాయి. కొంత మంది ఫ్యాన్స్ ప్లేయర్లు ప్రయాణిస్తున్న ఓపెన్ టాప్ బస్లోకి ఎక్కేందుకు, ప్లై ఓవర్ పై నుంచి దూకేందుకు ప్రయత్నించారు.
పరేడ్ కొనసాగుతున్న టైమ్లో మెస్సీ, రొడ్రిగో, డి మారియో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. వీళ్లు బస్సు టాప్పై కూర్చొని వెళ్తుండగా ఓ కేబుల్ వైర్ అడ్డుగా వచ్చింది. అప్రమత్తమైన ప్లేయర్లు కిందకు వంగడంతో ప్రమాదం తప్పింది. దాదాపు 50 లక్షల మంది ఫ్యాన్స్ రోడ్లపైకి రావడంతో బస్ కదలటానికి కూడా వీల్లేకుండా పోయింది. ఫలితంగా ప్లేయర్ల పరేడ్ మధ్యలోనే ఆగిపోయింది. మెస్సీ బృందాన్ని హెలికాప్టర్లో తరలించారు. హోమ్ టౌన్ రొసారియాలో ఇంటికి వెళ్తున్న టైమ్లోనూ మెస్సీకి వేల సంఖ్యలో ఫ్యాన్స్తో ఇబ్బంది తప్పలేదు. మరోవైపు సంచలన పెర్ఫామెన్స్తో ఈ వరల్డ్కప్లో నాలుగో స్థానంలో నిలిచిన మొరాకో టీమ్కు కూడా స్వదేశంలో గ్రాండ్ వెల్కమ్ లభించింది. రబత్ వీధుల వెంట వేలాది మంది ఫ్యాన్స్ రోడ్లకు ఇరువైపులా నిలబడి ప్లేయర్లకు స్వాగతం పలికారు.