
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీఐ) శుక్రవారం ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ మొబైల్ టారిఫ్లను 10-–21 శాతం పెంచుతునట్టు తెలిపాయి. తమ ప్రత్యర్థి రిలయన్స్ జియో టారిఫ్ పెంపును ప్రకటించిన మరునాడే ఈ నిర్ణయాన్ని ప్రకటించాయి. ఎయిర్టెల్, కొత్త చార్జీలు జులై 3 నుంచి, వీఐ చార్జీలు జులై 4 నుంచి అమలులోకి వస్తాయి. ఎయిర్టెల్లో రోజువారీ డేటా యాడ్-ఆన్ (1జీబీ) రేటు రూ. మూడు.. అంటే రూ. 19 నుంచి రూ. 22కి పెరుగుతుంది. రోజుకు 2జీబీ డేటా, 365-రోజుల వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్రేటును రూ.600 పెంచింది.
దీని ధర రూ.2,999 నుంచి రూ.3,599కి చేరనుంది. అన్లిమిటెడ్ వాయిస్ ప్లాన్ కేటగిరీలో.. రూ. 179 రీచార్జ్ ప్లాన్ ధరను రూ. 199కి పెంచింది. నెలకు 2జీబీ డేటాను అందించే ఈ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లో రూ. 20 పెరుగుదల ఉంది. బడ్జెట్ వినియోగదారులపై భారం పడకుండా ఉండేందుకు ఎంట్రీ-లెవల్ ప్లాన్ల ధరలను చాలా తక్కువగా పెంచామని ఎయిర్టెల్ తెలిపింది. మనదేశంలోని టెల్కోలు ఆర్థికంగా బలంగా ఉండాలంటే ...మొబైల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ (ఏఆర్పీయూ) రూ. 300 కంటే ఎక్కువగా ఉండాలని పేర్కొంది.
నెలకు ఒక్కో యూజర్నుంచి వచ్చే ఆదాయాన్ని ఏఆర్పీయూ అంటారు. ధరల పెంపుతో వచ్చే డబ్బును టెక్నాలజీ, పెట్టుబడుల కోసం వాడతామని కంపెనీ తెలిపింది. భారతదేశపు అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన జియో గురువారం మొబైల్ టారిఫ్లను 12–-27 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండు టెల్కోలు వరుసగా ప్రకటించిన టారిఫ్ రేట్ పెంపులను పరిశీలిస్తే, చాలా ఎయిర్టెల్ మొబైల్ ప్లాన్ల ధరలు రిలయన్స్ జియో కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు ఎయిర్టెల్ స్పందిస్తూ, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే భారతదేశంలోనే టారిఫ్లు తక్కువగా ఉన్నాయని పేర్కొంది. పెంపుతో టెలికం ఇండస్ట్రీకి మేలు జరుగుతుందని ఇక్రా తెలిపింది.