హైదరాబాద్,వెలుగు: వెల్ఫేర్ హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశాన్ని ఏఐఎస్ఎఫ్ నేతలు కోరారు. రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ రూ. 5600 కోట్లకు పైగా పెండింగ్ ఉన్నాయన్నారు. వీటిని విడుదల చేయకపోవడంతో డిగ్రీ, పీజీ తోపాటు వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ఆయా కాలేజీ యజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వడం లేదన్నారు. దాంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నేతలు చెప్పారు.
మంగళవారం సెక్రటేరియెట్ లో వెంకటేశాన్ని ఏఐఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీ పుట్ట లక్ష్మణ్, రామకృష్ణ, రెహమాన్ తో పాటు పలువురు కలిసి వినతిపత్రం అందచేశారు. 14ఏండ్లుగా కాస్మోటిక్ చార్జీలు పెంచడం లేదని, బాలికలకు నెలకు రూ.75, బాలురకు రూ.50 మాత్రమే చెల్లిస్తున్నారని వివరించారు.