న్యూఢిల్లీ: చాలా రాష్ట్రాలలో లాక్డౌన్లు ఉండటంతో ఈ ఏడాది అక్షయ తృతీయకి కూడా బంగారం, జ్యుయెలరీ అమ్మకాలు లేక షాపులు వెలవెలపోయాయి. దాదాపు రూ. 10 వేల కోట్ల అమ్మకాలను నష్టపోయినట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సెయిట్) అంచనా వేస్తోంది. అక్షయ తృతీయకు అమ్మకాలు లేకపోవడం ఇది వరసగా రెండో ఏడాదని బంగారం వ్యాపారులు వాపోతున్నారు. కిందటేడాది దేశమంతటా లాక్డౌన్ ఉండటంతో కస్టమర్లెవరూ బంగారం కొనేందుకు వీలు లేకుండా పోయింది. దేశంలో మొత్తం 4 లక్షల దాకా గోల్డ్, జ్యూయలరీ ట్రేడర్లు ఉన్నారు. చాలా రాష్ట్రాలలో లాక్డౌన్ అమలవుతుండటంతో ఈ అక్షయ తృతీయకి బంగారం, ఆభరణాలు అమ్మకాలే లేవని సెయిట్ నేషనల్ ప్రెసిడెంట్ బీ సీ భర్తియా చెప్పారు. ఈ ఏడాది అక్షయ తృతీయతోపాటు, రంజాన్ కూడా ఒకరోజే వచ్చాయని, దీంతో రంజాన్కు జరిగే అమ్మకాలను కూడా పోగొట్టుకున్నామని పేర్కొన్నారు.
షాపుల మూత
చాలా సిటీలలో జ్యుయెలరీ షాపులు లాక్డౌన్ వల్ల మూతపడే ఉన్నాయని ఆల్ ఇండి యా జ్యుయెలర్స్ అండ్ గోల్డ్స్మిత్ ఫెడరేషన్ కన్వీనర్ పంకజ్ అరోరా చెప్పారు. ధన్తేరాస్ తర్వాత ఎక్కువ బంగారం అమ్మకాలు జరిగే రోజు అక్షయ తృతీయనేనని పేర్కొన్నారు. కరోనా కారణంగా వరసగా రెండేళ్లు తమ వ్యాపారం దెబ్బతిందని చెప్పారు. 2019 లో అక్షయ తృతీయ రోజున దాదాపు రూ. 10 వేల కోట్ల అమ్మకాలు జరి గాయని గుర్తు చేశారు. అప్పట్లో బంగారం రేటు రూ. 35 వేలుగా ఉందన్నారు.ఈ ఏడాది రేటు రూ. 52 వేలుగా ఉన్నా వ్యాపా రం కేవలం రూ. 985 కోట్లని అరోరా చెప్పారు. అంటే రూ. 10 వేల కోట్ల విలువైన అమ్మకాలను నష్టపోయినట్లేనని పేర్కొన్నారు.