సీజనల్ వ్యాధులపై అలర్ట్.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే

సీజనల్ వ్యాధులపై అలర్ట్.. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఇంటింటి సర్వే
  • గ్రామాలు, వార్డుల్లో 106 మెడికల్​క్యాంపులు ఏర్పాటు
  • పీహెచ్​సీలు, హాస్పిటల్స్​లో అందుబాటులో మందులు
  • 74 డెంగ్యూ, 3 మలేరియా, 197 టైఫాయిడ్ కేసులు 
  • జ్వరాలు వస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించాలి
  • ప్రైవేట్ ​హాస్పిటల్స్​లో డెంగ్యూ పేరిట భయపెడితే చర్యలు 
  • మంచిర్యాల డీఎంహెచ్​వో హరీశ్​ రాజ్​

మంచిర్యాల, వెలుగు: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జిల్లాలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఉండడంతో వైద్య, ఆరోగ్యశాఖ అలర్ట్​అయ్యిందని మంచిర్యాల డీఎంహెచ్​వో డాక్టర్ హరీశ్​రాజ్​అన్నారు. డయేరియా, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, జ్వరాలను కంట్రోల్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ కుమార్​ దీపక్​ఎప్పటికప్పుడు టాస్క్​ఫోర్స్​కమిటీ మీటింగ్​ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు జిల్లాలో పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

 పీహెచ్​సీలు, హాస్పిటల్స్​లో అన్ని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. జ్వరాలు వస్తే వెంటనే డాక్టర్​ను సంప్రదించి ట్రీట్​మెంట్​ తీసుకోవాలన్నారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు.డీఎంహెచ్​వో చెప్పిన విషయాలు ఇవీ..

ఇంటింటి సర్వే, మెడికల్​ క్యాంపులు

వర్షాకాలం ప్రారంభం నుంచే జిల్లాలో ఆశా వర్కర్లతో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నాం. జ్వరపీడితులు ఉంటే ర్యాపిడ్ కిట్లతో టెస్టులు చేస్తున్నాం. సాధారణ జ్వరాలైతే మందులు ఇస్తున్నాం. డెంగ్యూ, మలేరియాగా అనుమానముంటే బ్లడ్​ శాంపిల్స్​ సేకరించి టీ హబ్​లో టెస్టులు చేస్తున్నాం. ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటివరకు 106 మెడికల్​ క్యాంపులు నిర్వహించాం. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 74 డెంగ్యూ, 3 మలేరియా, 197 టైఫాయిడ్,  897 డయేరియా, 5,930 అన్​నోన్​ ఫీవర్ కేసులు నమోదయ్యాయి. 8,150 ఓపీ కేసుల్లో 62 మాత్రమే ఫీవర్​ కేసులు నమోదయ్యాయి. 

ప్రైవేట్​ హాస్పిటల్స్​లో డెంగ్యూ టెస్టులు లేవు

వాతావరణ మార్పుల కారణంగా సాధారణ జ్వరాలు, దగ్గు, జలుబు వంటివి కామన్. వాటికి పెద్దగా భయపడాల్సిన పనిలేదు. జ్వరం తగ్గకపోతే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్​ను సంప్రదించి ట్రీట్​మెంట్​ తీసుకోవాలి. జిల్లావ్యాప్తంగా అన్ని పీహెచ్​సీలు, హాస్పిటల్స్​లో టెస్టింగ్ ​కిట్లు, అవసరమైన మందులు స్టాక్​ఉన్నాయి.

 కొన్ని ప్రైవేట్​ హాస్పిటల్స్​లో జ్వర బాధితులకు ప్లేట్​లెట్స్​ తగ్గితే డెంగ్యూ అని చెప్తున్నారు. కానీ ప్రైవేట్​ హాస్పిటల్స్​లో డెంగ్యూ టెస్టులు లేవు. గవర్నమెంట్​ హాస్పిటల్​లో మాత్రమే ఎలీసా టెస్టు ద్వారా డెంగ్యూ నిర్ధారణ జరుగుతుంది. ప్రైవేట్​ఆస్పత్రుల్లో డెంగ్యూ పేరిట పేషెంట్లను భయభ్రాంతులకు గురిచేస్తే యాక్షన్​ తీసుకుంటాం. 

జీజీహెచ్​లో పీవర్ ​వార్డు

జ్వర బాధితులకు మెరుగైన ట్రీట్​మెంట్​ అందించేందుకు వైద్యారోగ్య శాఖ ఆదేశాల మేరకు మంచిర్యాల గవర్నమెంట్​జనరల్​ హాస్పిటల్​లో 20 బెడ్స్​తో ఫీవర్​ వార్డును ఏర్పాటు చేశాం. ఇక్కడ నిత్యం స్పెషలిస్టు డాక్టర్లు, స్టాఫ్​ అందుబాటులో ఉంటారు. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్​, డయేరియా వంటి కేసులకు మెరుగైన ట్రీట్​మెంట్​ అందిస్తున్నాం. ప్రజలు జ్వరం రాగానే ప్రైవేట్​ హాస్పిటల్స్​కు పరుగెత్తాల్సిన అవసరం లేదు. 

రెసిడెన్షియల్​స్కూళ్లలో..

జిల్లాలోని 116 రెసిడెన్షియల్​ స్కూళ్లలో సీజనల్​వ్యాధులు, అంటురోగాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వారికి తెలియజేస్తున్నాం. దోమల నివారణ, మెరుగైన శానిటేషన్ చర్యలతో వ్యాధులను కంట్రోల్​చేయవచ్చు.

ప్రజలు అలర్ట్​గా ఉండాలి

సీజనల్​ వ్యాధులు, అంటురోగాల వ్యాప్తిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇంటి చుట్టూ నీళ్లు నిల్వ ఉండకుండా, దోమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల బారినపడకుండా కాపాడుకోవచ్చు. అలాగే శానిటేషన్​పై పంచాయతీ స్పెషల్ ఆఫీసర్లు, సెక్రటరీలకు, మున్సిపల్ కమిషనర్లకు అవసరమైన సూచనలు చేశాం. 

దోమల నివారణకు ఫాగింగ్​ చేయడం, ఆయిల్​ బాల్స్​ వేయిస్తుండడంతో ఈసారి జ్వరాల తీవ్రత అంతగా లేదు. డెంగ్యూ కేసులు నిరుటికంటే తగ్గాయి. గతేడాది ఇదే టైమ్​కు 230 డెంగ్యూ కేసులు నమోదైతే ఈసారి 74 కేసులు మాత్రమే వచ్చాయి. ఇప్పటివరకు జిల్లాలో మరణాలు నమోదు కాలేదు.