
- ఆమె హక్కులను కాపాడాలని ప్రధాని మోదీకి రిక్వెస్ట్
కోల్కతా: ఆపరేషన్ సిందూర్ సమయంలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో అరెస్టయిన ఇన్ఫ్లూయెన్సర్, లా స్టూడెంట్ శర్మిష్ట పనోలీకి అంతర్జాతీయ స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఆమెను కోల్కతా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని డచ్ ఎంపీ గీర్ట్ విల్డర్స్ ఖండించారు. ఇది వాక్ స్వాతంత్య్రానికి అవమానకరం అని పేర్కొన్నారు.
ఈమేరకు ‘ఎక్స్’లో ఆయన పోస్ట్ పెట్టారు. ‘‘శర్మిష్ట పనోలిని విడుదల చేయండి. ఆమెను అరెస్టు చేయడం వాక్ స్వేచ్ఛకు అవమానం. పాకిస్తాన్, మహ్మద్ ప్రవక్త గురించి మాట్లాడినందుకు ఆమెను శిక్షించకండి. ప్రధాని మోదీజీ.. ఆమె హక్కులను కాపాడండి” అని వ్యాఖ్యానించారు. ఈ పోస్ట్కు ‘ఆల్ ఐస్ ఆన్ శర్మిష్ట’ అని రాసిఉన్న ఆమె ఫొటోను జోడించారు. మహ్మద్ ప్రవక్తపై 2022లో బీజేపీకి చెందిన నుపుర్ శర్మ ఇలాంటి వ్యాఖ్యలు చేసినపుడు ఆమెకు కూడా గీర్ట్ విల్డర్స్ మద్దతుగా నిలిచారు.
గతంలో ఇలా స్పందించలేదేం.. పవన్ కల్యాణ్
శర్మిష్ట పనోలి అరెస్ట్పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కూడా స్పందించారు. దైవ దూషణను ఖండించాల్సిందే అంటూనే.. లౌకికవాదాన్ని ఓ కవచంగా ఉపయోగించొద్దని అన్నారు. గతంలో సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడిన టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని పశ్చిమ బెంగాల్పోలీసులను ప్రశ్నించారు.
సనాతన ధర్మంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడిన వీడియోను పవన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. పశ్చిమ బెంగాల్ పోలీసులు అందరిపట్ల ఒకేలా వ్యవహరించాలని సూచించారు. అలాగే, శర్మిష్ట అరెస్ట్ను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి కూడా ఖండించారు.
రాష్ట్రంలో సనాతనవాదులపైన మాత్రమే చర్యలు తీసుకుంటారని ఫైర్ అయ్యారు. పనోలిని కావాలని అరెస్టు చేశారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవియా ఆరోపించారు. ఒక వర్గం మద్దతు కోసం యువ హిందూ మహిళను అరెస్ట్ చేయడం దారుణమని అన్నారు.