నేనంటే అంత భయమెందుకు:ముత్తిరెడ్డి

నేనంటే అంత భయమెందుకు:ముత్తిరెడ్డి
  • పల్లా మీటింగ్​కొచ్చినోళ్లు జనగామ నేతలే కారు: ముత్తిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: జనగామ ప్రజా ప్రతినిధులు ఎవరూ బుధవారం హరితప్లాజాలో పెట్టిన మీటింగ్​కు వెళ్లలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. అక్కడికి వచ్చినవాళ్లంతా చాయ్ బిస్కెట్లు, సమోసాలు తిని వెళ్లే వారే అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని లీడర్లు, కార్యకర్తలంతా తనవెంటే ఉన్నారని అన్నారు. హైదరాబాద్ మల్లాపూర్​లోని నోమ ఫంక్షన్ హాల్​లో పార్టీ క్యాడర్​తో ముత్తిరెడ్డి గురువారం సమావేశం అయ్యారు. 

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం హైదరాబాద్​లోని హరితప్లాజాలో జనగామ నేతలతో మీటింగ్ పెట్టారు. ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వొద్దనే డిమాండ్​తో ఈ సమావేశం ఏర్పాటు చేయించారు. దానికి కౌంటర్​గా ముత్తిరెడ్డి గురువారం మల్లాపూర్​లో తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడారు. హరితప్లాజా మీటింగ్​కు జనగామ లీడర్లు ఎవరూ పోలేదన్నారు. 
కొందరు లీడర్లు హరిత ప్లాజాకు వచ్చినట్టు తెలుసుకుని తాను అక్కడికి వెళ్తే రూమ్​లలో దాక్కున్నారని తెలిపారు. అంతగా భయపడుతూ బతకడం ఎందుకని ప్రశ్నించారు. హరిత ప్లాజాకు వచ్చినోళ్లను గంప కింద కోళ్లను కమ్మినట్టు కమ్మారని, వాళ్ల దొంగ బతుకులు చూసి తాను బాధపడ్డానని అన్నారు. అభివృద్ధికి అడ్డం పడిన నేతల విషయంలో తాను కఠినంగా వ్యవహరించానని, గూండాలను కంట్రోల్ చేయడంలో తానూ గూండాగాన్నే అని స్పష్టం చేశారు. తాను కేసీఆర్ సైనికుడిని అని, తనపై చేస్తున్న కుట్రలన్నీ ఆయనకు తెలుసన్నారు. కొందరు కావాలనే తనపై వివాదాలు సృష్టిస్తున్నారని, వాటిని తిప్పికొడ్తానని అన్నారు.