- పల్లా మీటింగ్కొచ్చినోళ్లు జనగామ నేతలే కారు: ముత్తిరెడ్డి
హైదరాబాద్, వెలుగు: జనగామ ప్రజా ప్రతినిధులు ఎవరూ బుధవారం హరితప్లాజాలో పెట్టిన మీటింగ్కు వెళ్లలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. అక్కడికి వచ్చినవాళ్లంతా చాయ్ బిస్కెట్లు, సమోసాలు తిని వెళ్లే వారే అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని లీడర్లు, కార్యకర్తలంతా తనవెంటే ఉన్నారని అన్నారు. హైదరాబాద్ మల్లాపూర్లోని నోమ ఫంక్షన్ హాల్లో పార్టీ క్యాడర్తో ముత్తిరెడ్డి గురువారం సమావేశం అయ్యారు.
ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి బుధవారం హైదరాబాద్లోని హరితప్లాజాలో జనగామ నేతలతో మీటింగ్ పెట్టారు. ముత్తిరెడ్డికి టికెట్ ఇవ్వొద్దనే డిమాండ్తో ఈ సమావేశం ఏర్పాటు చేయించారు. దానికి కౌంటర్గా ముత్తిరెడ్డి గురువారం మల్లాపూర్లో తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో ముత్తిరెడ్డి మీడియాతో మాట్లాడారు. హరితప్లాజా మీటింగ్కు జనగామ లీడర్లు ఎవరూ పోలేదన్నారు.
కొందరు లీడర్లు హరిత ప్లాజాకు వచ్చినట్టు తెలుసుకుని తాను అక్కడికి వెళ్తే రూమ్లలో దాక్కున్నారని తెలిపారు. అంతగా భయపడుతూ బతకడం ఎందుకని ప్రశ్నించారు. హరిత ప్లాజాకు వచ్చినోళ్లను గంప కింద కోళ్లను కమ్మినట్టు కమ్మారని, వాళ్ల దొంగ బతుకులు చూసి తాను బాధపడ్డానని అన్నారు. అభివృద్ధికి అడ్డం పడిన నేతల విషయంలో తాను కఠినంగా వ్యవహరించానని, గూండాలను కంట్రోల్ చేయడంలో తానూ గూండాగాన్నే అని స్పష్టం చేశారు. తాను కేసీఆర్ సైనికుడిని అని, తనపై చేస్తున్న కుట్రలన్నీ ఆయనకు తెలుసన్నారు. కొందరు కావాలనే తనపై వివాదాలు సృష్టిస్తున్నారని, వాటిని తిప్పికొడ్తానని అన్నారు.