కరోనా వైరస్ కు చికిత్సనందించే నేపథ్యంలో వైద్య సిబ్బంది చాలా ఒత్తిడికి గురవుతున్నారని డీఎంఈ రమేష్ రెడ్డి అన్నారు. మెడికల్ ప్రొఫెషన్స్ ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని, మెడికల్ సిబ్బందికి అందరూ మద్దతుగా నిలబడాలన్నారు. కోర్ట్ లో రోజుకో పిల్ వేయడం మంచి పరిణామం కాదని చెప్పారు
కరోనా లక్షణాలున్నవారికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టెస్టులు చేసే ఏర్పాట్లు చేస్తున్నామని, లక్షణాలు ఉంటే వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి వెళ్ళాలని రమేష్ రెడ్డి సూచించారు. అన్ని జిల్లాల్లో చికిత్స చేస్తున్నామని, చికిత్స కోసం హైదరాబాద్ కు రావాల్సిన అవసరం లేదన్నారు. ఒకవేళ ఎవరికైనా ఎమర్జన్సీ ఉంటే అంబులెన్స్ లో హైదరాబాద్ గాంధీకి తరలించి చికిత్స చేయిస్తామని చెప్పారు.
లక్షలు అవసరం లేదు. 150 రూపాయలతో నయం చేయొచ్చు
సకాలంలో వైద్యం అందితే ప్రాణాపాయం తగ్గుతుందని, యాంటీ బాయటిక్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అన్ని కలిపి 150 రూపాయల వరకు మాత్రమే ఖర్చవుతాయని చెప్పారు. సకాలంలో వైద్యం అందితే లక్షల రూపాయలు అవసరం లేదని, ప్రయివేటు హాస్పిటల్ లో లక్షల రూపాయలు ఎందుకు ఛార్జ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వమే అన్ని సదుపాయాలు కల్పిస్తుందని, అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటికీ 6500 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని తెలిపారు
టెస్ట్ సెంటర్స్ దగ్గర జనం గుమిగుడుతున్నారని, లక్షణాలు లేని వారు భారీగా వచ్చి టెస్టులు చేయించుకుంటున్నారన్నారు. దీంతో వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
కరోనా వైరస్ నియంత్రణ కోసం సీఎం కేసీఆర్ 100 కోట్ల రూపాయలు మంజూరు చేశారని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 5 నెలలుగా కష్టపడి పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రంలో 3 లక్షల మందికి పైగా పరీక్షలు చేయగా.. 49 వేల మందికి పాజిటివ్ గా అని తేలిందని చెప్పారు. 2 లక్షల టెస్ట్ కిట్స్ అయిపోయాయని,. ఇంకా తెప్పించుకుంటామని అన్నారు. జిహెచ్ఎమ్సీ పరిధిలో 290 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టు శ్రీనివాస్ తెలిపారు.