- మళ్లీ అధికారం చేపట్టాక నిర్వహిస్తామని హామీ
- ఓబీసీ ఓటర్లకు కాంగ్రెస్ గాలం..
- పైలట్ను పక్కన పెట్టడంతో గుజ్జర్ల ఆగ్రహం
జైపూర్: రాజస్థాన్లోని ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏ అవకాశాన్ని కూడా వదలడం లేదు. అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే 2 రోజుల ముందు కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కుల గణన చేపడుతుందని ఈ నెల 7న ప్రకటించింది. దీంతో ఈ ప్రకటన అక్కడి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. కులాల మద్దతుతో మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కుల గణన చేస్తామన్న ప్రకటన.. ఎన్నికలపై ఎంత ప్రభావం చూపుతుంది..? గెహ్లాట్కు హెల్ప్ అవుతుందా? లేదా? అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంది.
కులాల ఓట్లే కీలకం
2011 లెక్కల ప్రకారం.. రాజస్థాన్ మొత్తం జనాభాలో దళితులు 17.80%, ఆదివాసీలు 13.50% మంది ఉన్నారు. ఆ తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రంలో కుల గణన చేపట్టలేదు. 2013, 2018లో సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్) చేపట్టిన సర్వే ప్రకారం.. రాజస్థాన్లో ఓబీసీలు సుమారు 35 నుంచి 40% ఉంటారని తేలింది. ఓబీసీ కేటగిరీలో జాట్లు 10% నుంచి 12% వరకు ఉంటారు. దళితుల్లోని జాతవ్ కమ్యూనిటీలో మేఘ్వాల్, బైర్వా సబ్ గ్రూప్లు 9% నుంచి 10% ఉంటారు. అప్పర్ క్యాస్ట్ గ్రూప్లోని రాజ్పుత్లు 9%, బ్రాహ్మణులు 6% వరకు ఉన్నారు. షెడ్యూల్ ట్రైబ్స్ పాపులేషన్లో మీనస్లు 50%, బిల్స్ 40% ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మీనస్లు 6.50%, బిల్స్లు 5% దాకా ఉన్నారు. ఇక, ముస్లింలు 9% ఉన్నారు.
కుల గణనతో ఎవరికి లాభం?
రాజస్థాన్లో 16% సీట్లు ఎస్సీలకు, 12% సీట్లు ఎస్టీలకు, ఓబీసీల కోసం 21% సీట్లు రిజర్వ్ చేశారు. అగ్రవర్ణాలతో పాటు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 2019లో గెహ్లాట్ ప్రభుత్వం మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ కేటగిరిలో ఉన్న గుజ్జర్లు, బంజారాలు, గడియా లోహార్స్, రైకాస్తో పాటు గడారియాలకు 5% రిజర్వేషన్లు కల్పించింది. తర్వాత 2023, ఆగస్టులో కాంగ్రెస్ సర్కార్ ఎంబీసీలకు 6% రిజర్వేషన్ ఇచ్చింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 70శాతానికి చేరాయి. నాన్జాట్ ఓబీసీలు మొత్తం జనాభాలో 20శాతానికి పైగా ఉన్నారు. రాజకీయంగా వీరే కాంగ్రెస్కు ఎంతో కీలకం.
రాజస్థాన్ రాజకీయ చరిత్రే వేరు
బీహార్, యూపీ లాంటి సోషల్ జస్టిస్ బేస్డ్ పొలిటికల్ హిస్టరీ రాజస్థాన్కు లేదు. 1920 కాలంలో షేఖావతి, మేవార్ రీజియన్లలో భూస్వామ్య వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి. షెఖావతి, మార్వార్లోని కొంత భాగంలో జాట్ కమ్యూనిటీ ఆధిపత్యం ఉండేది. ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్ తమకు అనుకూలంగా లేదంటూ రాజ్పుత్లోని మెజార్టీ వర్గం రామ రాజ్య పరిషత్(ఆర్ఆర్పీ), జన్సంఘ్కు మద్దతు ఇచ్చాయి. తర్వాత రాజ్పుత్లు అందరూ బీజేపీకి ఓటు బ్యాంకుగా మారిపోయారు.
వర్క్ఔట్ అవుతుందా?
దళిత, ఆదివాసీ, ముస్లిం, నాన్ డామినేట్ ఓబీసీ, జాట్ల ఓట్లు అశోక్ గెహ్లాట్ గెలుపును డిసైడ్ చేయనున్నాయి. గుజ్జర్ కమ్యూనిటీకి చెందిన సచిన్ పైలట్ను అశోక్ గెహ్లాట్ పక్కనపెట్టడం మైనస్గా ఉంది. రావణ రాజ్పుత్, గ్యాంగ్స్టర్ ఆనంద్ పాల్ సింగ్ ఎన్కౌంటర్ చేయడంతో పోయిన సారి రాజ్పుత్లు కాంగ్రెస్ వైపు మళ్లారు. జాట్ వర్గానికి చెందిన వ్యక్తిని స్టేట్ చీఫ్గా నియమించి అసంతృప్తిని కొంత తగ్గించుకుంది. కుల గణన అంశం కలిసి వస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.