అమరావతి రాజధాని భూముల కేసు విచారణ ఈ నెల 22 కు వాయిదా

అమరావతి రాజధాని భూముల కేసు విచారణ ఈ నెల 22 కు వాయిదా

అమరావతి రాజధాని  అసైన్డ్‌ భూముల కేసులో సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ  ఈ నెల 22కు వాయిదా పడింది. రాజధాని అసైన్డ్ భూముల కేసును రీ ఓపెన్ చేయాలంటూ హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన  పిటిషన్ పై ఇవాళ ( నవంబర్ 10) విచారణ జరిగింది.  గతంలో ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి నారాయణ క్వాష్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు విచారణ జరిపి వాదనలు ముగిసినట్లు తెలిపింది. అనంతరం తీర్పును రిజర్వు చేసింది. అయితే తాజాగా సీఐడీ నారాయణ వేసిన క్వాష్‌ పిటిషన్‌ను రీఓపెన్‌ చేయాలని మరోసారి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.  అయితే ఈ కేసులో  మరో నలుగురిని నిందితులుగా చేర్చామని.. కేసును పూర్తిస్థాయిలో మళ్లీ విచారించాలని సీఐడి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతి రాజధాని  అసైన్డ్‌ భూముల కేసులో  సీఐడి దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం ( నవంబర్ 10)   విచారణ జరిపిన హైకోర్టు  ఈనెల 22కు వాయిదా వేసింది. 

 ఇకపోతే రాజధాని అసైన్డ్‌ భూముల వ్యవహారంలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2021 ఫిబ్రవరి 24న సీఐడీకి ఫిర్యాదు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఏపీ అసైన్డ్‌ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీంతో మాజీమంత్రి నారాయణ హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి 2021 మార్చి 19న స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సీఐడీ స్టే ఎత్తివేయాలంటూ అనుబంధ పిటిషన్లు వేసింది.  ఇరుపక్షాల వాదనలు ముగియడంతో ఆగస్టు 30న తీర్పును రిజర్వు చేసింది. ఈ కేసును రీ ఓపెన్ చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన హైకోర్టు నవంబర్ 22 కు వాయిదా వేసింది.