
- 36 మంది యాత్రికులకు గాయాలు
రాంబన్/జమ్మూ: అమర్నాథ్ యాత్రలో ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఐదు బస్సులు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 36 మంది యాత్రికులకు గాయాలయ్యాయి.
శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ రాంబన్ జిల్లా చందర్కోట్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 6,979 మంది యాత్రికులతో కూడిన నాలుగో బ్యాచ్ -భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి దక్షిణ కాశ్మీర్లోని పహల్గాం బేస్ క్యాంప్కు రెండు వేర్వేరు కాన్వాయ్లలో తెల్లవారుజామున బయలుదేరింది. అందులో ఒక బస్సు బ్రేకులు ఫెయిలవడంతో ముందున్న బస్సును ఢీకొట్టింది.
ఇలా మొత్తం ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొని ధ్వంసమయ్యాయి. వెంటనే స్థానిక అధికారులు, భద్రతా సిబ్బంది గాయపడిన వారిని రాంబన్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ట్రీట్మెంట్అనంతరం యాత్రికులు వేరే బస్సులలో తిరిగి అమర్నాథ్ యాత్రలో పాల్గొన్నారు.