ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల 3 రోజుల క్రితం బ్రేక్ పడిన అమర్నాథ్ యాత్ర జులై 9 న మళ్లీ ప్రారంభమైంది. దీంతో ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. ఇవాళ మధ్యాహ్నం గరిష్ట సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకున్నారు. జమ్ము కశ్మీర్లో ఏర్పడ్డ ప్రతికూల పరిస్థితుల వల్ల అధికారులు యాత్రకు రావడం శ్రేయస్కరం కాదని చెప్పి.. మూడు రోజుల క్రితం జాతీయ రహదారులపై రాకపోకలను నిషిధించారు. ప్రస్తుతానికి పహాల్గామ్ మార్గంలో మాత్రమే రాకపోకలు మొదలయ్యాయి.
బల్తాల్లో వర్షాలు కురుస్తున్నందున అక్కడ ఇంకా ప్రారంభించలేదు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి కేవలం 6 రోజుల పాటే భక్తుల దర్శనాలు జరిగాయి. ఇప్పటి వరకు దాదాపు 67,566 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అధికారులు చెప్పారు. జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు అమర్నాథ్ యాత్ర కొనసాగనుంది. రక్షణ దళ సిబ్బంది కొండ చరియలు ఉన్న ప్రాంతాల్లో రక్షణ చర్యలు పర్యవేక్షిస్తున్నారు.