
అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ తమ కో–-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు భాగస్వామ్యాన్ని రెన్యువల్ చేశాయి. ఈ ఏడాది అక్టోబరు 11 నుంచి ఈ కార్డుతో చేసే అంతర్జాతీయ లావాదేవీలపై ఫారెక్స్ మార్కప్ చార్జీ 1.99 శాతానికి తగ్గుతుంది. గతంలో ఇది 3.5 శాతం ఉండేది. ఈ కార్డు అమెజాన్లో షాపింగ్, ట్రావెల్ బుకింగ్స్పై ప్రైమ్ సభ్యులకు 5శాతం అపరిమిత క్యాష్బ్యాక్, నాన్-ప్రైమ్ సభ్యులకు 3శాతం క్యాష్బ్యాక్ లభిస్తుంది. ఈ క్రెడిట్ కార్డుకు వార్షిక, జాయినింగ్ ఫీజులు ఉండవు. అమెజాన్లో కొంటే 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంటుంది.
ఈ నెల 18 నుంచి ఫార్మా ప్రో 2025
లైఫ్సెన్సెస్, ఫార్మా కంపెనీల కోసం ఈ నెల 18–20 తేదీల మధ్య హైదరాబాద్లో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో అనలిటికా ల్యాబ్ ఇండియా, ఫార్మా ప్రో&ప్యాక్ 2025 నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెటర్ రవీంద్ర జడేజా ప్రచారకర్తగా వ్యవహరిస్తారు. 650కి పైగా ఎగ్జిబిటర్లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందులో సాఫ్ట్ వేర్ పెవిలియన్, ఇన్నోవేషన్ లాంచ్ప్యాడ్, అంతర్జాతీయ పెవిలియన్స్, వివిధ కాన్ఫరెన్స్లు ఉంటాయి. ఈ సమావేశాలలో ఇంటెలిజెంట్ ల్యాబ్, ఫార్మా 2030, అనలిటిక్స్ అడ్వాంటేజ్ వంటి అంశాలపై చర్చలు జరుపుతారు.
స్లీప్వెల్ ఇన్సెన్స్ స్టిక్స్లో హానికర రసాయనం
స్లీప్వెల్ దోమల నివారణ అగరుబత్తీలలో మెపర్ఫ్లుత్రిన్ అనే అక్రమ రసాయనం ఉన్నట్లు గుర్తించామని హోమ్ ఇన్సెక్ట్ కంట్రోల్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ రసాయనం ఉపయోగించడానికి కేంద్ర క్రిమిసంహారక బోర్డు, రిజిస్ట్రేషన్ కమిటీ ఆమోదం లేదని తెలిపింది. ఆశికా ఇన్సెన్స్ దీనిని తయారు చేస్తోందని హెచ్ఐసీఏ తెలిపింది. ప్రభుత్వం ఆమోదించిన దోమల నివారణ ఉత్పత్తులపై సీఐఆర్ నంబర్ ఉంటుందని, దానిని చూసి మాత్రమే కొనుగోలు చేయాలని హెచ్ఐసీఏ కార్యదర్శి జయంత్ దేశ్పాండే సూచించారు.
నవంబర్ 25 నుంచి పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్
దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ను నవంబర్ 25 నుంచి మూడు రోజుల పాటు హైటెక్స్లో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ ఎక్స్పోను "వన్ నేషన్, వన్ ఎక్స్పో" థీమ్తో నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. నవంబర్ 25న నాలెడ్జ్ డేతో ఈవెంట్ ప్రారంభమవుతుంది. ఈ ఎగ్జిబిషన్లో 50 దేశాల నుంచి 500కి పైగా ఎగ్జిబిటర్లు, 50వేల మందికి పైగా సందర్శకులు పాల్గొంటారని ప్రకటించింది.