కర్ణాటకలో విషపూరితమైన ఉమ్మెత్త (datura) పండ్లు, విత్తనాలను ఆహార పదార్థాలుగా ఆన్లైన్లో విక్రయిస్తున్నందుకు అమెజాన్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్ కంపెనీల ఫుడ్ లైసెన్సును కర్ణాటక రాష్ట్ర ఆహార భద్రతా శాఖ నిలిపివేసింది.
ఉమ్మెత్త అనేది తీవ్రమైన విషపూరిత మొక్క. దీనిని తింటే ఆరోగ్యానికి తీవ్ర ప్రమాదం వాటిల్లుతుంది. అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ ఉమ్మెత్త ప్యాకెట్లపై 'FSSAI' అనుమతి కూడా ముద్రించి, తినే ఆహార పదార్థాలుగా విక్రయిస్తున్నట్లు తేలింది.
ఈ ప్లాట్ఫారమ్ల నుండి ఉమ్మెత్తకు సంబంధించిన అన్ని ప్రకటనలు, లిస్టింగ్లను వెంటనే తొలగించాలని, వీటిని సప్లయ్ చేస్తున్న విక్రేతల లైసెన్సులను కూడా రద్దు చేయాలని అధికారులు ఆదేశించారు.
అమెజాన్ ఈ విషయంపై ఇంకా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. కానీ స్విగ్గీ ఇన్స్టామార్ట్ వివరణ ఇచ్చేందుకు కొంత సమయం కోరింది.
బిగ్బాస్కెట్ ఈ ఉత్పత్తుల అమ్మకాన్ని వెంటనే నిలిపివేసినట్లు తెలిపింది. భవిష్యత్తులో ఒకవేళ అమ్మినా "ఇది తినడానికి కాదు" (Not for Human Consumption) అనే హెచ్చరికతో మాత్రమే విక్రయిస్తామని వెల్లడించింది.
►ALSO READ | ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
శ్రావణ మాసంలో పరమశివుని పూజకు ఉమ్మెత్త పువ్వులు, పండ్లను భక్తులు విశేషంగా ఉపయోగిస్తారు. సముద్ర మంథనం సమయంలో శివుడు హాలాహలాన్ని స్వీకరించిన వృత్తాంతానికి ప్రతీకగా పూజల్లో వీటిని సమర్పిస్తారు. ఈ మాసంలో పూజల కోసం ఉమ్మెత్తకు డిమాండ్ పెరిగినప్పటికీ, ఇది కేవలం పూజలకు మాత్రమే పరిమితమని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
