
అంబర్ పేట, వెలుగు: సుందరంగా ముస్తాబయిన అంబర్పేట బతుకమ్మ కుంటను ఈ నెల 25న బతుకమ్మ సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. అదే రోజు అక్కడ బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మేయర్ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, జలమండలి ఎండీ కె.అశోక్రెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్ హనుమంతరావు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్ రెడ్డి బతుకమ్మ కుంటను పరిశీలించారు.
అనంతరం ఉత్సవాలపై సమీక్ష నిర్వహించారు. కబ్జాకు గురై నిర్మాణ వ్యర్థాలతో, పిచ్చి మొక్కలతో ఉన్న చెరువును పునరుద్ధరించి సుందరంగా తయారుచేయడంపై హైడ్రా కృషి అభినందనీయమని మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. హైడ్రా కమిషనర్ యజ్ఞంలా పనులు నిర్వహించారని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శంభుల శ్రీకాంత్ గౌడ్, పుల్ల నారాయణస్వామి, డీపీ రెడ్డి, మోత రోహిత్ ముదిరాజ్, గడ్డం శ్రీధర్ గౌడ్, కోటం అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.