- గంటన్నర పాటు ట్రాఫిక్లో చిక్కుకున్న అంబులెన్స్
- అనాథలైన ముగ్గురు చిన్నారులు
ఘట్కేసర్/ఉప్పల్, వెలుగు: హైదరాబాద్ ఉప్పల్లో ఆదివారం (ఏప్రిల్ 05) జరిగిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఓ బాలింతను బలిగొంది. నేపాల్కు చెందిన సురేశ్, బిష్ణ (30) దంపతులు ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చి ఘట్కేసర్లో నివాసం ఉంటున్నారు. వీరికి సాగర్ (6), సందీప్ (4), పాప (26 రోజులు) ఉన్నారు.
బిష్ణ స్థానికంగా ఉన్న ఓ దుస్తుల దుకాణంలో పనిచేస్తుండేది. ఆదివారం సాయంత్రం ఆమెకు అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్ రావడంతో, సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బీబీనగర్ ఎయిమ్స్కు తీసుకెళ్లగా అక్కడి డాక్టర్లు హైదరాబాద్ నిమ్స్కు రిఫర్ చేశారు. వెంటనే బిష్ణను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుండగా, ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ వల్ల భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
దీంతో దాదాపు గంటన్నర పాటు అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దారి ఇవ్వాలని, అంబులెన్స్ సిబ్బంది, మృతురాలి బంధువులు ఎంత ప్రాధేయపడినా ఒక్క వాహనం కూడా ముందుకు కదల్లేదు. ఈ క్రమంలో ఎమర్జెన్సీలో ఉపయోగించే ఆక్సిజన్ కూడా పూర్తిగా అయిపోవడంతో బిష్ణకు శ్వాస అందక అంబులెన్స్లోనే ప్రాణాలు విడిచింది.
దీంతో ముగ్గురు చిన్నారులు తల్లి లేని పిల్లలుగా మిగిలిపోయారు. గంటన్నర సేపు ట్రాఫిక్లో అంబులెన్స్ చిక్కుకుపోయినా అక్కడ డ్యూటీ చేసే పోలీసులు స్పందించలేదని అంబులెన్స్ డ్రైవర్, మృతురాలు బంధువులు ఆరోపించారు. సకాలంలో పోలీసులు స్పందించి, అంబులెన్స్కు దారి ఇచ్చి ఉంటే బిష్ణ బతికేదని చెబుతున్నారు.
