అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్ కు హక్కు  లేదు

అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్ కు హక్కు  లేదు

హైద‌రాబాద్- అంబులెన్సుల నిలిపివేత‌పై తెలంగాణ ప్ర‌భుత్వంపై సీరియ‌స్ అయ్యింది హైకోర్ట్. శుక్ర‌వారం తెలంగాణ సరిహద్దుల్లో అంబులెన్స్‌ల వివాదంపై హైకోర్టులో విచారణ జ‌రిగింది. తాము ఆదేశాలు ఇచ్చినా... సర్క్యులర్ ఎలా జారీ చేస్తారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి ఒక్కరికి ప్రాణాలు కాపాడుకునే హక్కు ఉందని, విజయవాడ, హైదరాబాద్ మార్గం నేషనల్‌ హైవే.. దానికి కేంద్ర ప్రభుత్వంపై అధికారం ఉంటుందని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదని చెప్పింది. అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ సర్కార్ కు హక్కు లేదని, ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ కూడా.. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ లాంటిది ఇవ్వలేదని తెలిపింది. కోర్ట్ చెప్పినా కూడా ఆదేశాలు పాటించలేదని హైకోర్టు సీరియ‌స్ అయ్యింది. 

ఈ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. తెలంగాణకు నాలుగు రాష్ట్రాల సరిహద్దులు ఉన్నాయని తెలిపారు. ఈనెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్కులర్‌పై హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై మాట్లాడిన ఏజీ.. రాష్ట్ర ప్రజల బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ అధికారులు కరోనాపై రివ్యూ చేసి.. ఇతర రాష్ట్రాలకు ఈ సర్క్యులర్ జారీ చేశారని ధర్మాసనానికి తెలిపారు. ఏజీ వాదనలను ఖండిస్తూ.. ఇతర రాష్ట్రాల ప్రజలను నిలువరించడం దేనికని హైకోర్టు ప్రశ్నించింది. 

పేషంట్లను తీసుకొస్తున్న అంబులెన్స్‌లు ఆపడం ఎక్కడైనా చూశామా అని ప్ర‌శ్నించింది. రైట్ టు లైఫ్ ను ఆపడానికి మీకు ఏం అధికారం ఉందంది. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి నిబంధన మేం చూడలేదని.. రోగులు సరిహద్దుల్లోనే చనిపోతున్నారని.. పేషెంట్లు చనిపోతుంటే మీరు సర్క్యులర్లు జారీ చేస్తారా? సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ జనరల్‌ బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల ప్రజలకే కాదు.. హైదరాబాద్‌లో ప్రజలకు సైతం అడ్మిషన్ ఉండట్లేదు. హైదరాబాద్ లో పేషెంట్లకు ఆక్సిజన్ అవసరమైతే.. చిన్న ఆస్పత్రుల నుంచి పెద్ద ఆస్పత్రులకు వెళ్లడం లేదా.. గద్వాల్, ఖమ్మం, నిజామాబాద్ నుండి కూడా.. 300 కి.మీ ప్రయాణం చేసి పేషంట్లు వస్తున్నారు, వారిని ఆపుతున్నారా.. రాజ్యాంగాన్ని మీరు మార్చలేరు అంటూ సీరియ‌స్ అయ్యింది హైకోర్ట్. తదుపరి విచారణను ఈ నెల 17కు హైకోర్టు వాయిదా వేసింది.