
- నాలా కుంచించుకుపోవడమే కారణమంటూ హైడ్రా చీఫ్కు వివరణ
హైదరాబాద్ సిటీ, వెలుగు: అమీర్ పేట మెట్రో స్టేషన్ పరిసర ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం పరిశీలించారు. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి జూబ్లీహిల్స్, కృష్ణానగర్, యూసుఫ్ గూడ, ఎల్లారెడ్డి గూడ ప్రాంతాలతో పాటు మధురానగర్, శ్రీనివాస్ నగర్ వెస్ట్ నుంచి భారీగా వరద రావడంతో రోడ్డుపై నీరు నిలిచిందని అధికారులు కమిషనర్ కు వివరించారు.
40 అడుగుల వెడల్పుతో పై నుంచి వచ్చిన వరద కాలువలు అమీర్ పేట, ఎస్ఆర్ నగర్ మెయిన్రోడ్డు దాటే సమయంలో 10 అడుగులకు కుంచించుకుపోవడంతో ఈ సమస్య తలెత్తిందని చెప్పారు. అమీర్ పేట మెట్రో స్టేషన్ కింద నిర్మించిన కల్వర్టులో ఉన్న పైపు లైన్లలో ఒకటి పూడికతో మూసుకుపోవడంతో సమస్య తీవ్రమైందన్నారు.
వెంటనే పైపు లైన్లలో పూడికను తొలగించాలని కమిషనర్ సూచించారు. అప్పటికి సామర్థ్యం సరిపోకపోతే పైన వాహన రాకపోకలకు ఆటంకం కలగకుండా టన్నెల్ మాదిరి పనులు చేపట్టి అదనంగా పైపులైన్లు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం లక్డీకాపూల్ ప్రాంతాలను పరిశీలించారు. చౌరస్తాలో పైపులైన్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.