3 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీ

3 ట్రిలియన్ డాలర్ల భారీ ఆర్థిక ప్యాకేజీ
  • ఆమోదం తెలిపిన అమెరికన్ ప్రతినిధుల సభ

వాషింగ్టన్ : కరోనా తో తీవ్రంగా డ్యామేజ్ అయిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అమెరికా భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 3 ట్రిలియన్ డాలర్ల ఫైనాన్షియల్ ప్యాకేజీకి ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే మెజార్టీ. దీంతో డెమోక్రాట్లు ప్రతిపాదించిన ఈ బిల్లు ఈజీగానే ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 208 మంది ఓట్లు వేయగా వ్యతిరేకంగా 199 మంది ఓటేశారు. రిపబ్లికన్లు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నప్పటికీ ఆ పార్టీ కి చెందిన ప్రతినిధి ఒకరు ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. డెమొక్రాట్లలో 14 మంది దీన్ని వ్యతిరేకించారు. మెజార్టీ సభ్యులు బిల్లుకు సపోర్ట్ చేయటంతో ఈ ప్యాకేజీకి ఆమోదం తెలిపినట్లైంది. ఈ ఆర్థిక సహాయాన్ని అమెరికా పౌరులకు నేరుగా అందించాలని డెమోక్రాట్లు కోరారు. కరోనా ఎఫెక్ట్ తో కోట్లాది మంది ఉద్యోగాలు కోల్పోయినందున వారిని ఆదుకునేందుకు డైరెక్ట్ గా వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయనున్నారు. కరోనా ఎఫెక్ట్ తో మొదటి సారి బిల్లు కు ఓటింగ్ కు రిమోట్ విధానాన్ని అమలు చేశారు. సభకు రాలేని ప్రతినిధులు ఎవరి ద్వారానైనా స్పీకర్ కు తమ ఓటు చేరేలే చేయటమే రిమోట్ ఓటింగ్ సిస్టమ్. ఈ బిల్లు పాస్ అవ్వటానికి స్పీకర్ నాన్సీ పెలోసి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.