ఇండియా గ్రేట్..మీరంటే లవ్!

ఇండియా గ్రేట్..మీరంటే లవ్!

ఇండియాను అమెరికా ప్రేమిస్తుందని, గౌరవిస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటుందని అన్నారు. హ్యుమానిటీకి ఇండియా ఓ హోప్ ఇస్తుందని కామెంట్ చేశారు. సోమవారం గుజరాత్​లోని అహ్మదాబాద్​లో జరిగిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడారు. నమస్తే అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆయన.. హార్డ్ వర్క్, డివోషన్ ద్వారా ఇండియన్లు ఏదైనా సాధించగలరనే దానికి ప్రధాని మోడీ లివింగ్ ప్రూఫ్ అని అన్నారు. చాయ్​వాలా స్థాయి నుంచి ఎదిగారని కొనియాడారు. ‘‘మోడీ… మీరు గుజరాత్​కు మాత్రమే గర్వకారణం కాదు. హార్డ్ వర్క్, డివోషన్ ద్వారా ఇండియన్లు ఏదైనా సాధించగలరనే దానికి సజీవ సాక్ష్యం” అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో స్టేడియం చప్పట్లతో మారుమోగింది. ‘‘ఇండియన్ రిపబ్లిక్​కు అద్భుతమైన విజయవంతమైన నాయకుడు మోడీ. అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకు జరిగిన ఎన్నికల్లో..తిరుగులేని విజయం సాధించారు’’ అని అన్నారు. ట్రంప్ తన ప్రసంగంలో స్పిరిచ్యువల్ లీడర్ స్వామీ వివేకానందను ప్రస్తావించారు. మోడీని అందరూ ప్రేమిస్తారని, ఆయన చాలా టఫ్ నెగోషియేటర్ అని చెప్పారు.దేశం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని కొనియాడారు.

షోలే.. డీడీఎల్​జే

ట్రంప్ తన ప్రసంగంలో బాలీవుడ్ ఆల్​టైం హిట్ సినిమాలు షోలే, దిల్​వాలే దుల్హనియా లే జాయేంగే(డీడీఎల్​జే) గురించి ప్రస్తావించారు. బాలీవుడ్ సినిమాలు చూడటం ద్వారా ప్రజలు ఎంతో ఆనందం పొందుతారని, అలాగే ఇండియన్​కల్చర్​ను అర్థం చేసుకుంటారని అన్నారు. ‘‘ఇండియా ఓ క్రియేటివ్‌ హబ్‌. ఇండియాలో ఏడాదికి 2 వేల సినిమాలు నిర్మిస్తారు. భూగ్రహం మీద ఉన్న ప్రజలంతా బాలీవుడ్‌ సినిమాలను ఆస్వాదిస్తారు. భాంగ్రాను ఇష్టపడతారు. దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే, షోలే వంటి క్లాసిక్‌ సినిమాలను చూస్తారు” అని చెప్పారు.

ఇండియానే లీడ్​ చేయాలి..

టెర్రరిజంపై ఇండియా, అమెరికా దేశాలు ఉమ్మడి పోరు సాగిస్తున్నాయని ట్రంప్ అన్నారు. టెర్రర్ గ్రూపులను, మిలిటెంట్లను అణచివేసేందుకు పాకిస్తాన్‌తో కలిసి తమ ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు. ‘‘సరిహద్దులను కాపాడుకునేందుకు, కంట్రోల్​లో ఉంచుకునేందుకు ప్రతి దేశానికి హక్కు ఉంది. టెర్రరిజాన్ని ఆపడానికి, టెర్రర్ ఐడియాలజీతో పోరాడటానికి అమెరికా, ఇండియా కృషి చేస్తున్నాయి. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం ముప్పు నుంచి పౌరులను రక్షించాలనే గట్టి సంకల్పంతో రెండు దేశాలు ఉన్నాయి. ఈ రీజియన్​లో శాంతిని పెంపొందించడంలో ఇండియాది నాయకత్వ పాత్ర” అని అన్నారు. ‘‘పాకిస్తాన్‌తో మా సంబంధాలు చాలా బాగున్నాయి. పాక్​లో ప్రోగ్రెస్ ​కనిపిస్తోంది. ఉద్రిక్తతలు తగ్గుతాయని, స్థిరత్వంతోపాటు దక్షిణ ఆసియాలోని అన్ని దేశాల్లో సామరస్యం నెలకొంటుందని ఆశభావంగా ఉన్నాం” అని చెప్పారు.