పాఠశాల బాలికలకు రుతుస్రావ సెలవులపై ఇప్పుడు కేరళలో పెద్ద చర్చ కొనసాగుతోంది. రుతుస్రావం సమయంలో ప్రతి నెలా బాలికలకు మూడు రోజులు సెలవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం ఓ ప్రతిపాదనను తీసుకురాగా ఈ అంశంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తొలుత మంచినిర్ణయమే అనిపించినప్పటికీ భవిష్యత్తులో కొన్న సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయంలో పునరాలోచించాలని కేరళ శాస్ట్ర సాహిత్య పరిషత్ (KSSP) ప్రభుత్వాన్ని కోరింది.
ప్రతి నెలా మూడు రోజుల సెలవు తీసుకుంటే, ఒక విద్యార్థిని ఏడాదికి దాదాపు 30 రోజుల పాటు పాఠశాలకు దూరమయ్యే అవకాశం ఉందని కేఎస్ఎస్పీ తెలిపింది. దీంతో చదువులో వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. రుతుస్రావం ఒక సహజ ప్రక్రియ..దానిని అనారోగ్యంగా భావించకూడదని శాస్త్రవేత్తలు సూచించారు. సెలవుల కంటే పాఠశాలల్లో శుభ్రమైన మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, శానిటరీ నాప్కిన్లు, విశ్రాంతి గదులు వంటి సదుపాయాలు కల్పించడం మరింత ఉపయోగకరమని అబిప్రాయం వ్యక్తం చేశారు.
ALSO READ : భారత సైనిక చరిత్ర కొత్త అధ్యాయం
అయితే తీవ్రమైన నొప్పి లేదా అసౌకర్యంతో బాధపడే విద్యార్థినుల కోసం మాత్రమే ఈ సెలవులు ఐచ్ఛికంగా ఉండనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. బాలికలకు మెరుగైన సౌకర్యాలు, అవగాహన కల్పించడమే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
