
కోతులపై రెమ్డెసివిర్ మందు సక్సెస్.. అమెరికా ట్రయల్స్
వాషింగ్టన్: రెమ్డెసివిర్ మందు కరోనాపై బాగా పనిచేస్తున్నట్టు తేలింది. జస్ట్ మూడు రోజుల్లోనే కరోనాను ఆ మందు చంపేసింది. దాని ఆనవాళ్లు లేకుండా చేసింది. మకాక్స్ అనే జాతి కోతులపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయ్యాయి. అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్కు చెందిన సైంటిస్టులు మందును ప్రయోగించి ఈ నిర్ధారణకు వచ్చారు. త్వరలోనే మనుషులపైనా ఆ మందును పరీక్షిస్తామని చెప్పారు. కోతులను రెండు బ్యాచ్లుగా విడదీసి, కరోనా వైరస్ను ఎక్కించారు. ఒక బ్యాచ్లోని కోతులకు లంగ్స్లో వైరస్ సంఖ్య పెరిగిన 12 గంటల తర్వాత రెమ్డెసివిర్ మందును ఇచ్చారు. ఆరు రోజుల పాటు రోజుకో డోసు చొప్పున ఆ మందును వేశారు.
ఇంకో బ్యాచ్ (కంట్రోల్డ్ గ్రూప్) కోతులతో పోలిస్తే రెమ్డెసివిర్ ఇచ్చిన కోతుల్లో వైరస్ క్రమంగా తగ్గిపోయిందని గుర్తించారు. లంగ్స్ డ్యామేజీ కూడా తగ్గిందని తేల్చారు. ఫస్ట్ డోస్ ఇచ్చిన 12 గంటల తర్వాత ఆ కోతుల్లో లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్లో వైరల్ లోడ్ 100 రెట్లు తగ్గినట్టు గుర్తించారు. మూడు రోజుల్లో వైరస్ పూర్తిగా నశించినట్టు నిర్ధారించారు. మనుషుల్లోనూ ఇవే రిజల్ట్స్ వస్తాయని సైంటిస్టులు చెప్పారు. కరోనా సోకిన వెంటనే పేషెంట్లకు రెమ్డెసివిర్ మందును ఇస్తే న్యుమోనియాతో పాటు కరోనాను తగ్గించొచ్చని తేలింది. ఇప్పటికే అమెరికాకు చెందిన గిలియడ్ అనే ఫార్మా కంపెనీ ఆ మందును పెద్ద మొత్తంలో తయారు చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనూ మూడు కంపెనీలతో గిలియడ్ ఒప్పందం చేసుకుంది.
సింగపూర్ మందుపై క్లినికల్ ట్రయల్స్
సింగపూర్ కంపెనీ మోనోక్లోనల్ యాంటీబాడీని తయారు చేసింది. టీవై027 పేరుతో తయారు చేసిన ఆ మందును వచ్చే వారం నుంచే మనుషులపై ఫేజ్1 క్లినికల్ ట్రయల్స్ చేయనుంది. ఈ మేరకు టీవై027ను అభివృద్ధి చేసిన తైచన్ అనే సంస్థ బుధవారం ప్రకటన చేసింది. సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ నుంచి హ్యూమన్ ట్రయల్స్కు అనుమతి వచ్చినట్టు చెప్పింది. తద్వారా కరోనా మందుపై ట్రయల్స్ దశకు వచ్చిన మొదటి సింగపూర్ కంపెనీ తైచన్ నిలిచింది. ఇప్పటికే ప్రపంచంలోని చాలా సంస్థలు మోనోక్లోనల్ యాంటీబాడీలను తయారు చేసినా.. క్లినికల్ ట్రయల్స్ దశకు ఏవీ రాలేదని అక్కడి మీడియా ప్రకటించింది. ఇంటర్నేషనల్ లెవెల్లో క్లినికల్ ట్రయల్స్కు రిజిస్టర్ చేసుకున్న మొదటి కంపెనీ తైచన్ అని పేర్కొంది.