
న్యూఢిల్లీ, వెలుగు: ఈ నెలాఖరున తెలంగాణకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా రానున్నారు. నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు మెయిన్ ఆఫీసును ఆయన ప్రారంభించనున్నారు. ఈ మేరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు చైర్పర్సన్ పల్లె గంగిరెడ్డి సోమవారం ఢిల్లీలో అమిత్ షాను కలిసి పసుపు బోర్డు మెయిన్ ఆఫీసు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. తమ ఆహ్వానంపై అమిత్ షా సాను కూలంగా స్పందించారని ఎంపీ అర్వింద్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆయన నిజామాబాద్ కు రావాలని నిర్ణయించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఓపెనింగ్ ప్రోగ్రాం లో పసుపు బోర్డు అధికారిక లోగోను కూడా అమిత్ షా ఆవిష్కరిస్తారని పేర్కొన్నారు. దేశంలో పసుపు పండించే సమాజానికి సాధికారత, ప్రతీకగా ఈ లోగో ఉంటుందన్నారు. సహకార సంఘాల స్ఫూర్తిని, రెతుల నేతృత్వంలోని అభివృద్ధిని మరింత బలోపేతం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ చివర్లో ఈ కార్యక్రమం జరుగుతుందని, తేదీ, టైం ఇంకా నిర్ణయించలేదని చెప్పారు. డేట్, టైం త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.