
హాంకాంగ్: అహ్మదాబాద్ దుర్ఘటన జరిగి రోజులు కూడా గడవక ముందే మరో ఎయిర్ ఇండియా విమానం ప్రయాణికులను టెన్షన్ పెట్టింది. విమానం గాల్లో ఉండగా పైలట్కు సాంకేతిక సమస్య తలెత్తిందని తెలియడంతో యూటర్న్ తీసుకుని ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. హాంకాంగ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI315 పైలట్ విమానం గాల్లో ఎగిరిన కాసేపటికే స్వల్ప సాంకేతిక సమస్యను పసిగట్టారు. ఎందుకైనా మంచిదని.. ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడ టేకాఫ్ అయిందో అదే విమానాశ్రయంలో రన్ వేపై విమానాన్ని పైలెట్ ల్యాండ్ చేయడంతో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే విమానాన్ని ల్యాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు.
✈️𝐁𝐨𝐞𝐢𝐧𝐠 𝐉𝐞𝐭𝐬 𝐑𝐞𝐭𝐮𝐫𝐧 𝐌𝐢𝐝-𝐀𝐢𝐫 𝐎𝐯𝐞𝐫 𝐆𝐥𝐢𝐭𝐜𝐡𝐞𝐬
— Conflict Monitor (@ConflictMoniter) June 16, 2025
🔸 Air India flight AI315 enroute from Hong Kong to Delhi was forced to return to its origin after the pilot suspected a technical issue mid-air.
🔸 A British Airways Boeing 787-8 Dreamliner, returned… pic.twitter.com/Ox4hGsMHsw
ప్రయాణికులను హాంకాంగ్ నుంచి ఢిల్లీకి చేర్చేందుకు మరో విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ విమానం కూడా బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 మోడల్కు చెందిన విమానమే కావడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. అహ్మదాబాద్లో 250 మందికి పైగా ప్రయాణికులు చనిపోయిన ఘటనలో ప్రమాదానికి కారణమైన విమానం కూడా బోయింగ్ డ్రీమ్ లైనర్ మోడల్ కావడమే ఇందుకు కారణం. సోమవారం ఉదయం హాంకాంగ్ నుంచి షెడ్యూల్ ప్రకారం.. ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI315 బోయింగ్ డ్రీమ్ లైనర్ 787-8 విమానం బయల్దేరింది. బయల్దేరిన కాసేపటికే మళ్లీ ల్యాండ్ అయింది.
ఒక్క ఈ విమానమే కాదు.. లండన్ నుంచి చెన్నైకి రావాల్సిన బ్రిటీష్ ఎయిర్ వేస్కు చెందిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం కూడా టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక లోపం తలెత్తడంతో లండన్లోని హీత్రో విమానాశ్రయంలో తిరిగి ల్యాండ్ అయింది. ఆదివారం ఈ ఘటన జరిగింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదు గానీ SOS ప్రోటోకాల్ ప్రకారం విమానం టేకాఫ్ అయిన కొంతసేపటికే విమానాశ్రయంలో ల్యాండ్ అయినట్లు బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. ఈ రెండు ఘటనల్లో టేకాఫ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యలు తలెత్తిన విమానాలు బోయింగ్ డ్రీమ్ లైనర్ మోడల్వే కావడంతో బోయింగ్ విమానాలు ఎక్కాలంటేనే ప్రయాణికుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్న పరిస్థితులు ఉన్నాయి.