రాజస్థాన్లో ఊహించని పరిణామం..ఎవరి ఊహకు అందని స్ట్రాటజీతో బీజేపీ అధిష్టానం అందరిని ఆశ్చర్యపర్చింది. రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను ప్రకటించింది. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన భజన్లాల్ శర్మ ను రాజస్థాన్ సీఎంగా అధికారికంగా ప్రకటించింది. సంగవేర్ నుంచి భజన్లాల్ శర్మ మొదటి సారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. సీఎం సీటు ఆశించిన మాజీ సీఎం వసుంధరా రాజే స్వయంగా భజన్ లాల్ శర్మ పేరును ప్రతిపాదించడం మరో ట్విస్ట్. భజన్ లాల్ శర్మ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడం.. భజన్ లాల్ శర్మపై బీజేపీ అధిష్టానికి ఉన్న నమ్మకం, పార్టీ పట్ల ఆయనకున్న విధేయతవల్లే సీఎం పదవి వరించిందిని తెలుస్తోంది.
అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ ను పడగొట్టి అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించిన వారం రోజుల తర్వాత రాజస్థాన్ సీఎంగా భజన్ లాల్ శర్మను బీజేపీ మంగళవారం (డిసెంబర్12) ప్రకటించింది. జైపూర్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన బీజేపీ శాసన సభా పక్ష సమావేశంలో.. ముగ్గురు కేంద్ర పరిశీలకుల సమక్షంలో ఈ ప్రకటన చేశారు. రాజస్థాన్ పదవికోసం మాజీ సీఎం వసుంధర రాజే, కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర షెకావత్, అశ్వినీ వైష్ణవ్ కూడా పోటీ పడ్డారు. వీరిని కాదని బీజేపీ అధిష్టానం ఎవరూ ఊహించన రీతిలో భజన్ లాల్ శర్మను రాజస్థాన్ సీఎంగా ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చింది.