- జ్యురిస్డిక్షన్ అమలుకు ఆంధ్రా ఓకే
- అభ్యంతరంలేని క్లాజులపై నెల రోజుల్లో సమాచారం ఇస్తమని వెల్లడి
- కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ మీటింగ్కు హాజరుకాని తెలంగాణ సర్కార్
- మీటింగ్ జరుగుతున్న బిల్డింగ్లోనే మన స్పెషల్ సీఎస్, ఇరిగేషన్ ఈఎన్సీ ఉన్నా వెళ్లలే
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి బోర్డుల జ్యురిస్డిక్షన్ గెజిట్ నోటిఫికేషన్ అమలుకు తాము సహకరిస్తామని ఏపీ సర్కార్ తెలిపింది. గెజిట్ నోటిఫికేషన్లో చేర్చిన ప్రాజెక్టుల్లో తమకు అభ్యంతరం లేని వాటికి సంబంధించిన సమాచారం నెల రోజుల్లోగా ఇస్తామని పేర్కొంది. గెజిట్ అమల్లోకి వచ్చే అక్టోబర్ 14 నుంచి బోర్డులకు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. సోమవారం హైదరాబాద్లోని జలసౌధలో కేఆర్ఎంబీ 13వ, జీఆర్ఎంబీ 10వ అత్యవసర సమావేశం నిర్వహించారు. కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మెంబర్ సెక్రటరీలు డీఎం రాయ్పురే, బీపీ పాండే, ఏపీ వాటర్ రీసోర్సెస్ సెక్రటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణరెడ్డి, రెండు బోర్డుల సభ్యులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. తెలంగాణ అధికారులెవరూ ఈ సమావేశానికి హాజరుకాలేదు. గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ మాట్లాడుతూ.. గెజిట్ నోటిఫికేషన్లోని క్లాజులపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలన్నారు. బోర్డుల నిర్వహణకు సంబంధించిన ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ రూపొందించాల్సి ఉన్నందున వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ఏపీ సెక్రటరీ స్పందిస్తూ.. తమకు అభ్యంతరం లేని వాటికి సంబంధించిన సమాచారం నెల రోజుల్లోగా ఇస్తామన్నారు. షెడ్యూల్ -2, 3లోని ప్రాజెక్టులపై తమకు అభ్యంతరాలు ఉన్నాయని, వాటిని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. చైర్మన్ అయ్యర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాల మోహరింపు అంశంపై కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్తామని, జలశక్తి శాఖ హోం మంత్రిత్వ శాఖతో సంప్రదించి దీనిపై నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బోర్డుల జ్యురిస్డిక్షన్ అమలుకు రెండు రాష్ట్రాలు సహకరించాలన్నారు. బోర్డుల నిర్వహణకు నగదు డిపాజిట్ చేయాలని కోరారు. దీనిపై తమ ప్రభుత్వంతో సంప్రదించి చర్యలు తీసుకుంటామని ఏపీ అధికారులు బదులిచ్చారు. కోర్టు కేసులు, డిపార్ట్మెంట్ వ్యవహారాల్లో బిజీగా ఉన్నా సమావేశానికి హాజరైన ఏపీ అధికారులను రెండు బోర్డుల చైర్మన్లు అభినందించారు.
అక్కడే ఉన్నా మనోళ్లు రాలే
జ్యురిస్డిక్షన్ అమలుకు ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ రూపొందించడానికి ఈ నెల 3న రెండు బోర్డులు కో ఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించాయి. ఆ సమావేశానికి తాము రాలేమని, ఫుల్ బోర్డు మీటింగ్ పెట్టాలని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసింది. తెలంగాణ కోరినట్టుగానే సోమవారం ఫుల్ బోర్డుల మీటింగ్ పెట్టినా తెలంగాణ అధికారులు సమావేశానికి హాజరుకాలేదు. సుప్రీంకోర్టులో కేసు, ఎన్జీటీలో విచారణ ఉందని చెప్పి డుమ్మా కొట్టారు. బోర్డుల మీటింగ్కు వేదికైన జలసౌధలోనే ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్ ఉన్నా మీటింగ్కు దూరంగా ఉన్నారు.
విభజన చట్టంలో చేర్చిన ప్రాజెక్టులకు రక్షణ ఇవ్వాలని కోరాం: శ్యామలరావు
విభజన చట్టంలో చేర్చిన ప్రాజెక్టులకు రక్షణ ఇవ్వాలని కోరినట్లు ఏపీ వాటర్ రీసోర్సెస్ సెక్రటరీ శ్యామలరావు తెలిపారు. బోర్డుల సమావేశం తర్వాత జలసౌధలో ఆయన మీడియాతో మాట్లాడారు. గెజిట్ నోటిఫికేషన్ను తమ ప్రభుత్వం స్వాగతించిందని, అమలుకు పూర్తిగా సహకరిస్తామని సమావేశంలో చెప్పామన్నారు. ప్రాజెక్టులు, ఇన్ఫ్రాస్ట్రక్షర్ ఇతరత్రా ఏమేం బోర్డులకు ఇవ్వాల్సి ఉంటుందో స్టడీ చేస్తున్నామని తెలిపారు. రెండు, మూడో షెడ్యూళ్లపై తమకు అభ్యంతరాలున్నాయని, వాటిపై కేంద్రానికి లెటర్ రాస్తామన్నారు. మూడో షెడ్యూల్లోని ప్రాజెక్టులపై బోర్డుల నియంత్రణ తప్పించాలని కోరుతామని చెప్పారు.
కేసు విచారణ ఉండటంతోనే వెళ్లలేదు: రజత్కుమార్
కృష్ణా నీళ్ల పునఃపంపిణీకి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో తెలంగాణ దాఖలు చేసిన విత్డ్రా పిటిషన్పై విచారణ ఉండటంతోనే బోర్డుల సమావేశానికి వెళ్లలేదని తెలంగాణ ఇరిగేషన్ స్పెషల్ సీఎస్ రజత్కుమార్ తెలిపారు. జలసౌధలో ఆయన మీడియాతో చిట్చాట్ చేశారు. ఎన్జీటీలో కోర్టు ధిక్కార పిటిషన్ కూడా సోమవారమే విచారణకు వచ్చిందని తెలిపారు. అందుకే బోర్డుల మీటింగ్కు వెళ్లలేమని, మరో రోజు సమావేశం ఏర్పాటు చేయాలని రెండు బోర్డులకు ముందుగానే లెటర్ రాశామన్నారు. కేవలం అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలను ఎజెండాలో చేర్చారని, తెలంగాణ కోరిన నీటి వినియోగం తదితర అంశాలు లేవని చెప్పారు. మరో రోజు సమావేశం ఏర్పాటు చేస్తే వెళ్లేందుకు తాము సిద్ధమేనన్నారు.