అన్ లిస్టెడ్ పంచాది 12 భవనాల్లో వాటా కోసం ఏపీ డిమాండ్

అన్ లిస్టెడ్ పంచాది 12 భవనాల్లో వాటా కోసం ఏపీ డిమాండ్
  •   రెండు రోజుల క్రితం ఏపీ సీఎస్ మీటింగ్
  •   పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10లో లేని భవనాల కోసం పట్టు
  •   ఏపీ అడుగుతున్నవాటిలో కోఠీలోని వీవీపీ బిల్డింగ్
  •   ఖాళీ చేయాల్సిన భవనాల లిస్ట్ రెడీ చేసిన ఆఫీసర్లు

హైదరాబాద్: జూన్ 2వ తేదీతో ఉమ్మడి రాజధాని అంకం ముగిసింది. జాబితా ప్రకారం లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మాసబ్ ట్యాంక్ లోని సీఐడీ భవనం, ఆదర్శ్ నగర్ లోని హెర్మిటేజ్ బిల్డింగ్ ఏపీ ఆధీనంలోనే ఉన్నాయి. ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో పలు ఆఫీసులు ఏపీకి తరలిపోయాయి. వీటిని స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అంతకు ముందే సమావేశం పెట్టి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే.

 ఇందుకు సంబంధించిన జాబితా సిద్ధమైంది. సీఎం ఆమోదముద్ర తర్వాత ఏపీకి పంపే అవకాశం ఉంది. ఇదే తరుణంలో రెండు రోజుల క్రితం కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్, 9,10లలో నమోదు చేయని ఆస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. ప్రస్తుతం మొత్తం 12 సంస్థలు, భవనాల్లో ఏపీ వాటా కోరుతోంది. ఇందులో కోఠీలోని వైద్య విధాన పరిషత్ భవనం తమదేనని పట్టుపడుతోంది.

 ఇది తమ ఆస్తి అని ఏపీ పేర్కొంటోంది. ఈ ఆస్తులపై ఏపీకి ఎలాంటి హక్కు లేదంటూ తెలంగాణ గట్టిగానే ఎదురుదాడి చేసింది. ఈ ఆస్తులన్నీ వేల కోట్ల విలువైనవని కావడంతో ఇరు రాష్ట్రాలు బెట్టుసడలడం లేదని సమాచారం. ఈ మేరకు రెండు రోజుల క్రితం ఏపీ ప్రభుత్వ ఆస్తులపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్‌ ప్రసాద్‌ హైదరాబాద్‌లో అధికారులతో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మాసబ్ ట్యాంక్‌లోని సీఐడీ భవనం, ఆదర్శనగర్‌లోని హెర్మిటేజ్ బిల్డింగ్‌ను కోరాలని ఏపీ నిర్ణయించినట్లు సమాచారం. వీటి విలువ వేల కోట్లలో ఉంటుంది.  గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఐఏఎస్‌ అధికారుల భవనాలు సహా 56 ప్రధాన భవనాలు, మరో 590 స్టాఫ్‌ క్వార్టర్‌లు ఏపీలో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం ఆడిట్‌లో తేలింది. 

ఏపీకి కేటాయించిన ఐఏఎస్‌ అధికారులు బేగంపేటలోని కుందన్‌బాగ్‌లోని 34 క్వార్టర్లలో, బంజారాహిల్స్ ఐఏఎస్, ఐపీఎస్ క్వార్టర్లలో 21 మంది, పంజాగుట్ట క్వార్టర్స్‌లో నలుగురు నివాసం ఉంటున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటిని ఖాళీ చేశారా..? లేదా..? అన్నది తేలాల్సి ఉంది. 

12 భవనాలు ఏవంటే..?

తొలుత 32 ఆస్తులపై ఏపీ ప్రభుత్వం  ప్రధానంగా దృష్టి సారించింది. ఇప్పుడు చాలా సంస్థలు పనికిరానివి, మూసివేసినవి ఉన్నాయి. దీంతో తామే 12కి తగ్గించినట్టు ఏపీ అధికారులు చెబుతున్నారు. ఆ 12 సంస్థల్లో గండిపేటలో ఆక్టోపస్ భవనం, భూమి, హాకా భవన్, ఖైరతాబాద్‌లోని ఫార్మసీ కౌన్సిల్, ఎస్టేట్ కార్యాలయ భవనాలు, రెడ్ హిల్స్‌లోని హార్టికల్చర్ భవనం తదితరాలు ఉన్నాయి.