సూర్యాపేట, వెలుగు : అంగన్వాడీ సెంటర్లలో పిల్లలు, బాలింతలకు క్వాలిటీ ఫుడ్ అందజేస్తున్నామని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పురుగులు పట్టిన బియ్యం, ఎక్స్పైరీ అయిన కందిపప్పు, కల్తీ కారం వాడుతుండడంతో చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. క్వాలిటీ ఆహారాన్ని ఇవ్వాలని ఆఫీసర్లు చెబుతున్నా అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకులు మాత్రం పట్టించుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అన్ని సరుకులు కల్తీనే...
సూర్యాపేట జిల్లాలో సూర్యాపేట అర్బన్, చివ్వెంల, తుంగతుర్తి, హుజూర్నగర్, కోదాడ ప్రాజెక్టుల పరిధిలో 1,209 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో 19,888 మంది చిన్నారులు, 13,640 మంది గర్భిణులు ఉన్నారు. అలాగే యాదాద్రి జిల్లాలో మొత్తం 901 సెంటర్లు ఉండగా వీటి పరిధిలో 16,261 మంది చిన్నారులు, 5,723 మంది గర్భిణులు ఉన్నారు. వీరికి ప్రతి రోజు అన్నం, ఆకుకూర, పప్పు, గుడ్డుతో పాటు 200 మిల్లీలీటర్ల పాలు అందించాలి. అయితే కొందరు అంగన్వాడీ సెంటర్ల నిర్వాహకులు క్వాలిటీ లేని ఫుడ్ అందజేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బియ్యం, పప్పులో పురుగులు ఉన్నా పట్టించుకోకుండా వండడంతో చిన్నారులు, గర్భిణులు అనారోగ్యం బారిన పడుతున్నారు. పురుగులు పట్టిన పప్పు, కల్తీ కారం వాడుతున్నారంటూ సూర్యాపేట మండలం టేకుమట్ల అంగన్వాడీ సెంటర్కు బుధవారం పేరెంట్స్ తాళం వేసి నిరసన తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసే పౌష్టికాహారం, పాలను బయట మార్కెట్లో అమ్ముకొని, క్వాలిటీ లేని సరుకులను తెచ్చి చిన్నారులకు వండి పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సూర్యాపేట పరిధిలోని ఒక అంగన్వాడీ సెంటర్కు సరఫరా అయిన పాలను ఆలయాలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
తగ్గుతున్న ఎగ్స్ సైజ్
అంగన్వాడీ సెంటర్లకు ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే తక్కువ సైజ్ ఉన్న ఎగ్స్ సరఫరా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. సూర్యాపేట జిల్లాలో ఎగ్స్ సరఫరా కాంట్రాక్టర్ నేటితో ముగియనుంది. దీంతో ఎగ్స్ సరఫరా కోసం ఈ నెల 16న ఈ ప్రొక్యూర్మెంట్ టెండర్లు ఆహ్వానించగా మళ్లీ పాత కాంట్రాక్టర్లే టెండర్లు వేసినట్లు తెలిసింది. జిల్లాకు చెందిన ఓ ముఖ్య లీడర్ అండదండలు ఉండడంతో గత రెండేళ్ల నుంచి ఎగ్స్ కాంట్రాక్ట్ వీరికే దక్కుతోంది. అంతేకాకుండా ఒక్క కాంట్రాక్టర్కు ఒక్క ప్రాజెక్ట్ పరిధిలోనే కాంట్రాక్ట్ ఇవ్వాలన్న రూల్ ఉన్నా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. సూర్యాపేట జిల్లాలోని ఐదు ప్రాజెక్ట్ల పరిధిలో ఇద్దరు కాంట్రాక్టర్లకే ఎగ్స్ సరఫరా బాధ్యతను అప్పగించారు. దీంతో వారు నాసిరకం ఎగ్స్ను సరఫరా చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
అంగన్వాడీ సెంటర్లలో క్వాలిటీ ఫుడ్ అందించాలని ఆదేశించాం. ఎవరైనా పిల్లలకు కల్తీ ఫుడ్ ఇచ్చినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం నిర్ణయించిన సైజ్ ప్రకారమే ఎగ్స్ సరఫరా చేయాలని షోకాజ్ నోటీలుసు ఇచ్చాం. ఇటీవల వచ్చిన ఫిర్యాదులపై ఎంక్వైరీ చేస్తున్నాం.
– జ్యోతి పద్మ, వెల్ఫేర్ అధికారి, సూర్యాపేట